కాచిగూడ, జూలై 1: బీజేపీ ప్రభుత్వానికి దమ్ము, దైర్యముంటే హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీసీల విధాన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీల కోసం తీర్మానం చేయకుంటే బీజేపీ ప్రభుత్వంపై బీసీల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం కాచిగూడ హోటల్లో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, ఏటా బడ్జెట్లో రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాలను పక్కనపెట్టి, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తిచేయాలని కోరారు. గత 74 ఏండ్లుగా బీసీలకు ప్రజాస్వామ్యబద్ధంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ‘బీసీలంటే బిచ్చగాళ్లు కాదు. బీసీలంటే వాటాదారులు.. కోట్ల మంది బీసీలకు ప్రధాని వ్యతిరేకమా?’ అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ఇతర సంస్థలను అమ్ముటం ఆపేయాలని, బీసీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, లాల్కృష్ణ, కోలా జనార్దన్, మట్ట జయంతిగౌడ్, రవీందర్, చంద్రశేఖర్, ఉదయ్కుమార్, వంశీకృష్ణ, విజయ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.