హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): పూల పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు పంపిణీని చేసేందుకు బతుకమ్మ చీరలు సిద్ధమయ్యాయి. ఈ ఏడా ది రూ.340 కోట్ల వ్యయంతో.. 30రకాల రంగులు, 800 కలర్ కాంబినేషన్లు, 240 పైచిలుకు వెరైటీ డిజైన్లతో కోటి 18లక్షల చీరలను ప్రభుత్వం తయారు చేయించింది. ఈసారి చీరలకు వెండి, బంగారు జరీ అంచులుండటం విశేషం.
బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన విషయం తెలిసిందే. ఎంతో ఉత్సాహంగా జరుపుకొనే ఈ పండుగకు మహిళలంతా కొత్త చీరలు ధరించాలని సీఎం కేసీఆర్ వారి కోసం ప్రతిఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లోని నేతన్నలతో వీటిని తయారు చేయించి మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. బతుకమ్మ సమీపిస్తుండటంతో 18 ఏండ్లు నిండిన ఆడపడుచులకు చీరలను పంపిణీ చేసేందుకు టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్ శాఖ సన్నాహాలు చేస్తున్నది.