సిద్దిపేట : కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలు కనుల పండువలా జరిగాయి. వేడుకల్లో జిల్లా అధికారులతో పాటు మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు శాఖలవారీగా పెద్ద సంఖ్యలో బతుకమ్మలను తీసుకొచ్చారు. అనంతరం బతుకమ్మలను ఒక చోట చేర్చి.. ఉయ్యాల పాటలు, నృత్యాలు, డప్పుచప్పుళ్లతో ప్రాంగణమంతా మార్మోగింది. మహిళా అధికారులతో పాటు కలెక్టర్ వెంకట్రామరెడ్డి దంపతులు, అదనపు కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
అంతకు ముందు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు బతుకమ్మలను ఆసక్తిగా పరిశీలించారు. బతుకమ్మ వేడుకలకు వచ్చిన ఆడపడుచులకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐడీఓసీలో తొలి బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతిని, పూలను ఆరాధించే అరుదైన పండుగ మన ఆడబిడ్డలదని అన్నారు.
బతుకమ్మ సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవానికి ప్రతీక అని.. పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ.. నేడు విశ్వవ్యాప్తమైందన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ చెన్నయ్య, మిషన్ భగీరథ పర్యవేక్షక ఇంజినీర్ చారి, పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజినీర్ కనక రత్నం, ఆర్డీఓలు జయచంద్రా రెడ్డి, విజయేంద్ర రెడ్డి, అనంత రెడ్డి, జిల్లా అధికారులు, ఇంజినీరింగ్ విభాగాల ఈఈ, తహసీల్దార్లు పాల్గొన్నారు.