Direct Tax Collections | గత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో గణనీయ వృద్ధిరేటు నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వసూళ్లతో పోలిస్తే 2024 మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.7 శాతం పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.19.58 లక్షల కోట్లకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరిగాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదివారం వెల్లడించింది. ప్రధానంగా వ్యక్తిగత ఆదాయం, కార్పొరేట్ ఆదాయం నుంచే నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరిగాయని సీబీడీటీ తెలిపింది. దీని ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో సవరించిన బడ్జెట్ అంచనాల కంటే 7.40 శాతం ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంతో సవరించిన అంచనాల ప్రకారం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13 వేల కోట్లు పెరిగాయి.
2022-23 ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.64 లక్షల కోట్ల నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.19.58 లక్షల కోట్లకు పెరిగాయి. 2023-24 బడ్జెట్ అంచనాల ప్రకారం తొలుత రూ.18.23 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలు కావాల్సి ఉండగా, సవరించిన అంచనాల ప్రకారం రూ.19.45 లక్షల కోట్లుగా నిర్ధారించారు. బడ్జెట్ తొలి అంచనాల ప్రకారం 7.40 శాతం, సవరించిన అంచనాల ప్రకారం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 0.67 శాతం పెరిగాయని సీబీడీటీ పేర్కొంది.
2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఐటీ రిటర్న్స్ 22.74 శాతం పుంజుకున్నాయి. 2022-23లో రూ.3.09 లక్షల కోట్ల రీఫండ్స్ జరిగితే, 2023-24లో రూ.3.79 లక్షల కోట్లు రీఫండ్ అయ్యాయి. ఇదిలా ఉంటే స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2022-23లో రూ.19.72 లక్షల కోట్లు రికార్డైతే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 23.37 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే 2023-24లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 18.48 శాతం గ్రోత్ రికార్డైంది.
స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 13.06 శాతం పెరిగి రూ.11.32 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.10 లక్షల కోట్లు మాత్రమే. నికర కార్పొరేట్ టాక్స్ వసూళ్లు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.8.26 లక్షల కోట్లు జరిగితే, 2023-24లో రూ.9.11 లక్షల కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. 2022-23తో పోలిస్తే 2023-24లో నికర కార్పొరేట్ టాక్స్ వసూళ్లు 10.26 శాతానికి పైగా వృద్ధి రికార్డైంది.
స్థూల వ్యక్తిగత ఆదాయం పన్ను వసూళ్లలో 24.26 శాతం వృద్ధి రికార్డయింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.9.67 లక్షల కోట్ల వ్యక్తిగత ఆదాయం పన్ను వసూలైతే, 2023-24లో రూ.12.01 లక్షల కోట్లకు చేరాయి. నికర వ్యక్తిగత ఆదాయం పన్ను వసూళ్లు 2022-23లో రూ.8.33 లక్షల కోట్లు జరిగితే 2023-24లో రూ.10.44 లక్షల కోట్లకు చేరాయి. 2022-23తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో నికర వ్యక్తిగత ఆదాయం పన్ను వసూళ్లలో 25.23 శాతం వృద్ధి రికార్డయింది.