న్యూఢిల్లీ: బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో ఢిల్లీ పోలీస్ అధికారి మరణానికి కారణమైన అరిజ్ ఖాన్ అలియాస్ జునైద్ను దోషిగా ఢిల్లీ కోర్టు నిర్ధారించింది. ఈ మేరకు సోమవారం తీర్పు వెల్లడించింది. ఇండియన్ ముజాహిదీన్కు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో అరిజ్ ఖాన్ ఒకడు. 2008 సెప్టెంబర్ 13న ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో 30 మంది చనిపోగా వంద మందికిపైగా గాయపడ్డారు. అనంతరం 19న ఢిల్లీలోని జామియా నగర్లో బాట్ల హౌస్ ఎల్ 18 వద్ద ఉగ్రవాది అరిజ్ ఖాన్, అతడి నలుగురు అనుచరులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టగా ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. దేశంలో పలు ఉగ్రవాద దాడులకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ నాయకుడు, ఆపరేషన్స్ హెడ్ అతిఫ్ అమీన్తోపాటుపాటు మహ్మద్ సైఫ్, మహ్మద్ సాజిద్ ఈ ఎన్కౌంటర్లో మరణించారు. అయితే అరిజ్ ఖాన్, షాజాద్ అహ్మద్ అక్కడి నుంచి తప్పించుకున్నారు.
మరోవైపు ఈ ఎన్కౌంటర్ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన పోలీస్ ఇన్స్పెక్టర్ మోహన్ చంద్ శర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన మరణానికి అరిజ్ ఖాన్, అతడి అనుచరులు కారణమని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పారిపోయిన షాజాద్ అహ్మద్ను అనంతరం పోలీసులు అరెస్ట్ చేయగా 2013లో కోర్టు అతడ్ని దోషిగా నిర్ధారించింది.
అయితే అరిజ్ ఖాన్ మాత్రం పదేండ్ల పాటు పోలీసుల కళ్లగప్పి తప్పించుకున్నాడు. అజమ్గఢ్కు చెందిన అతడు వృత్తిరీత్యా ఇంజినీర్. ఇండియన్ ముజాహిదీన్ కేడర్ను బలోపేతం చేయడం, కొత్తవారిని నియమించుకోవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చాడు. అరిజ్ ఖాన్పై పలు కేసులు నమోదు చేసిన ఎన్ఐఏ అతడిపై రూ.10 లక్షలు, బాట్లా ఎన్కౌంటర్కు సంబంధించి ఢిల్లీ పోలీసులు రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు.
కాగా, పదేండ్ల పాటు పరారిలో ఉన్న అరిజ్ ఖాన్ను 2018 ఫిబ్రవరిలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు బాట్లా ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ అధికారి మోహన్ చంద్ శర్మ మరణానికి అరిజ్ ఖాన్, అతడి అనుచరులు కారణమని ఢిల్లీ సెషన్స్ కోర్టు సోమవారం నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు పరిశీలించిన అనంతరం వారిని దోషులుగా ప్రకటించింది. ఈ నెల 15న శిక్షలు ఖారారు చేస్తామని అదనపు సెషన్స్ కోర్టు జడ్జి సందీప్ యాదవ్ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.