భారతీయ జానపద జనజీవన విధానంలో స్త్రీలు కలిసిమెలిసి కష్టసుఖాలను పంచుకోవడం ఒకరికొకరం అన్నచందంగా ఉండటం పరిపాటి. ఏ పండుగ జరుపుకున్నా ఆ సంస్కృతి సాంప్రదాయాలను తరతరాలుగా గ్రామీణ ప్రజలు కొనసాగిస్తున్నారు. దశాబ్దాలుగా దేవతారాధనలో భాగంగా జాతరలు, పండుగలు జరుపుకోవడమనేది ఆనవాయితీ. ఇవి ఆరోగ్యపరంగా, శాస్త్రీయపరంగానూ ఉపయోగకరమైనవి. వీటిలో సంతోషాలు, ఐకమత్యం మొదలైన అంశాలు ముడిపడి ఉంటాయి. అలాంటి పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి. తరతరాలుగా ఐక్యతను చాటుతూ పూజలందుకుంటున్న పూల జాతర అది.
మానవ జాతి స్త్రీ వల్లే మనగలుగుతున్నది. అందుకే తల్లిగా మహిళకు అంత గౌరవం దక్కింది. ఆ అమ్మతనాన్ని గౌరవించడానికే స్త్రీని దేవతలుగా కొలుస్తున్నారు. అలా అందరిచేత పూజలందుకొనే గొప్ప స్థానం స్త్రీకి దక్కింది. అలాంటి దేవతా మూర్తులే పోచమ్మ, మైసమ్మ, మహంకాళి, మారేడమ్మ, సమ్మక్క సారలమ్మలు. వారంతా గ్రామాల్లోని ప్రజల రక్షణకోసం పోరాడి వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వారే. వారు చేసిన త్యాగమే వారిని దేవతలను చేసి ఇప్పటికీ అందరిచే పూజలందుకునేలా చేసింది. అలాంటి స్త్రీ దేవతాపూజ లో ఒక ఆరాధన భావమే బతుకమ్మ పండుగ.
ఎన్నో ఏండ్లుగా అణచివేతకు గురైన మహిళలు సాంత్వన పొందే సరికొత్త జీవనశైలికి ప్రతిబింబం బతుకమ్మ. స్త్రీలందరూ కష్టసుఖాలను ఆత్మీయంగా గానంచేస్తూ ఆనందాలను పంచుకొని, మానసికంగా ఆరోగ్యపరంగా సాంత్వన పొందే రూపమే బతుకమ్మ పండుగ.
బతుకమ్మ పండుగ జరుపుకోవడం వెనుక ఎన్నో కథలు, చారిత్రక నేపథ్యాలు వినిపిస్తుంటాయి. రెండవ శతాబ్దంనాటి ఇక్ష్వాకుల కాలంలో ‘హరీతి’ అనే పిల్లలను ఎత్తుకుపోయే రాక్షసి ఉండేదట. ఆమె బుద్ధుని బోధనల వల్ల మంచిగా మారి ఆ తర్వాత కాలంలో పిల్లలను రక్షించే దేవతగా పూజలందుకున్నదట. అం దరూ ఆమెను పిల్లల దేవతగా కొలిచి పుట్టిన తమ పిల్లలు బతుకాలనీ, రోగాలు రొష్టులూ రాకుండా చూడాలని ‘హరీతి’ని ఆరాధించేవారు. 12వ శతాబ్దం నాటి శాసనాల్లోనూ ‘హరీతి’ ప్రస్తావన ఉన్నది. అలా కాలక్రమంలో ‘హరీతి’నే పిల్లల్ని బతికించే దేవత కనుక ‘బతుకమ్మ’ గా రూపాంతరం చెంది ఉండవచ్చని విశ్వసిస్తారు. ఆమెను ఆరాధిస్తూ ఆడుతూ, పాడుతూ పండుగ చేసుకుంటారు.
ఒక్కేసి పువ్వేసి చందమామ/ ఒక్క జాములాయె చందమామ
బ్రహ్మొచ్చె వేళాయె చందమామ/బ్రహ్మ రాకపాయె చందమామ
తంగేడు వనములకు చందమామ/తాళ్ళులేకపాయె చందమామ
గుమ్మాడి వనములకు చందమామ/గూళ్ళూలేకపాయె చందమామ
ఇలా పాటలుగా చరిత్రను గానం చేస్తూ దేవతల ప్రతిరూపాలను తలుచుకుంటూ స్త్రీలంతా కలిసికట్టుగా బతుకమ్మ ఆడుతా రు. తంగేడు, గునుగు, గుమ్మడి, కట్ల పూలు, చామంతి, దాసన్న (మందారం) గన్నేరు, పట్టుకుచ్చులపూలు మొదలగు అడవి లో దొరికే పువ్వులను ఉపయోగించి త్రికోణాకారంలో బతుకమ్మను పేర్చి శిఖరం మధ్యలో గుమ్మడి పువ్వును ఉంచి మధ్యలో పసుపు తో గౌరమ్మను తయారు చేసి పసుపు, కుంకుమలతో అలంకరించి చప్పట్లు చరుస్తూ ఆడిపాడుతారు.
కలవారి కోడలు ఉయ్యాలో/ కలికి కామాక్షి ఉయ్యాలో
కడుగుతున్నది పప్పు ఉయ్యాలో/కడవలో పోసి ఉయ్యాలో
వచ్చిరి అన్నలూ ఉయ్యాలో/వనములను దాటి ఉయ్యాలో
పుట్టినింటికి వచ్చిన ఆడపడుచు తను తల్లిగారింటికి రావడానికి ఎన్ని తంటాలు పడిందో పై పాట ద్వారా తెలియజేస్తుంది.
శ్రీ గౌరి నీపూజను ఉయ్యాలో/ చేయబూనితినమ్మ ఉయ్యాలో
కాపాడి మమ్మేలు ఉయ్యాలో/ కైలాసపురాణి ఉయ్యాలో
శాంకరీ పార్వతి ఉయ్యాలో/ శంభూనిరాణి ఉయ్యాలో
అంటూ అందరూ గానం చేస్తూ ఉంటే కన్నుల పండువగా మహిళా సమైక్యతను ఇనుమడింపజేసేదిగా ఉంటుంది.మనసంప్రదాయాన్ని విస్మరించకుండా ఆరోగ్య కరమైన పండుగను జరుపుకుని తెలంగాణా బతుకమ్మ పండుగ విశిష్టతను చిరకాలం నిలిచిపోయే విధంగా కాపాడుకోవడం రాబో యే తరాలకు అందించటం మనందరి కర్తవ్యం.
(అక్షరయాన్ సౌజన్యంతో)
– వాసరచెట్ల జయంతి
99855 25355