కామారెడ్డి, నవంబర్ 21: కాంగ్రెస్ నాయకులు డబ్బులు ఇస్తామని నమ్మబలికి తనతో అబద్ధాలు చెప్పించారని మహిళా రైతు లక్ష్మి వాపోయారు. ‘కల్లాలకు కాంగ్రెస్’ కార్యక్రమంలో భాగంగా 3 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వచ్చినప్పుడు వారు చెప్పినట్టు మాట్లాడానే తప్పా తనకేమీ తెలియదన్నారు. ఆదివారం ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. ‘రేవంత్రెడ్డి వచ్చిన రోజు.. కాంగ్రెస్ నాయకులు నన్ను తీసుకపోయిండ్రు. అప్పుడు వాళ్లు చెప్పినట్టే మాట్లాడిన. 20 రోజుల నుంచి వడ్లు కొంటలేరని చెప్పాలని కాంగ్రెసోళ్లు చెప్పిండ్రు. పైసలిస్తమంటే వాళ్లు చెప్పమన్నట్టే చెప్పిన. నన్ను బాగిరెడ్డి బద్నాం చేయించిండు. నన్ను అంత మందిలో ముందుకు తోసి మాట్లాడించిండు. మొల్కలు వచ్చినయి అని తప్పుడు మాటలు చెప్పించిండు. నన్ను మోసం చేసి తోలుకపోయిండు. నా కొడుకు నన్ను తిట్టిండు. పైసలిస్తమంటే అబద్ధం చెప్పిన’అని లక్ష్మి వాపోయింది.