సికింద్రాబాద్, జనవరి 5: కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయదల్చిన బస్తీ దవాఖానల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారును ఎమ్మెల్యే సాయన్న ఆదేశించారు. బుధవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఎమ్మెల్యే సాయన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. కంటోన్మెంట్ పరిధిలో సుమారు 20 బస్తీ దవాఖానలు ఏర్పాటయ్యే విధంగా కృషి చేయాలని సూచించారు. బస్తీ దవాఖానలు అందుబాటులోకి వస్తే నియోజకవర్గంలోని పేదలకు వైద్యం చెంతనే దొరుకుతుందన్నారు. బోర్డు పరిధిలోనే కాకుం డా మోండా డివిజన్లోని పలు బస్తీల్లో సైతం దవాఖానలు ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. సమీక్షా సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ రాజకుమారి, బోయిన్పల్లి మెడికల్ ఆఫీసర్ శ్రీలక్ష్మితో పాటు వైద్యాధికారులు మీనాతో పాటు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.