కోదాడ, మార్చి 28 : హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేదలకు అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని డీఎంహెచ్ఓ కోటాచలంతో కలిసి ఆమె పరిశీలించి మాట్లాడారు. పేదలు, వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఖర్చులు భరించలేని వారికి అత్యాధునిక సౌకర్యాలతో కోదాడలో మొబైల్ వాహనం ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం పరీక్షల గురించి వైద్యులను, సాంకేతిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
మన శరీరంలో జరిగే మార్పులను గమనించుకుంటూ తరచూ డాక్టర్లను సంప్రదించి పరీక్షలు చేయిచుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలో 300 మంది వరకు క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సామినేని ప్రమీల, డీసీహెచ్ఎస్ వెంకటేశ్వర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్ దశరథ, డిప్యూటీ డీఎంహెచ్ఓ జయ మనోరి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ ఆదిత్య, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.