బడంగ్పేట, మార్చి7: కొవిడ్ వ్యాక్సినేషన్లో బాలాపూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) సత్తా చాటింది. సీవీసీ-1 సెంటర్ ద్వారా ఏకంగా 1,19,926 వ్యాక్సిన్ డోసులు పంపిణీచేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ పీహెచ్సీలో అత్యధిక వ్యాక్సిన్లు వేసిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్ఏ) ఎన్ ప్రశాంతి జాతీయస్థాయిలో ‘అత్యుత్తమ మహిళా వ్యాక్సినేటర్’ అవార్డుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కళాశాలలో జరిగే కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నది. తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసిన ప్రశాంతిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. బాలాపూర్ పీహెచ్సీ సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు. తమ పీహెచ్సీకి జాతీయస్థాయిలో గుర్తింపు లభించడంపై బాలాపూర్ మండల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల రక్షణే లక్ష్యంగా పనిచేశా..
కరోనా కష్టకాలంలో ప్రజలను కాపాడాలన్న లక్ష్యంతో పనిచేశా. వైద్యాధికారులతోపాటు తోటి సిబ్బందితో కలిసి నేను చేసిన ప్రయత్నానికి మంచి ఫలితం వచ్చింది. బెస్ట్ ఫిమేల్ వ్యాక్సినేటర్ అవార్డుకు ఎంపికవడం సంతోషంగా ఉన్నది. ఇది నా జీవితంలో మరువలేని జ్ఞాపకం. ఈ అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగింది. ప్రజల సేవకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను.