అగ్ర హీరో బాలకృష్ణ మరో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లో భాగం కాబోతున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. శృతిహాసన్ కథానాయిక. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. బాలకృష్ణ నటిస్తున్న 107వ చిత్రమిది. ‘ఎన్బీకే107’ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందించనున్నారు. ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్నివ్వగా, బోయపాటి శ్రీను కెమెరా స్విఛాన్ చేశారు. హరీష్శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘వాణిజ్య అంశాలు కలబోసిన పక్కా మాస్ చిత్రమిది. బాలకృష్ణ శైలి హంగులతో ఆకట్టుకుంటుంది. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కథను తయారుచేశాం. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, ఎడిటర్: నవీన్నూలి, సంగీతం: తమన్, ఫైట్స్: రామ్లక్ష్మణ్, సీఈఓ: చెర్రీ, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.