శివమొగ్గ, ఫిబ్రవరి 21: హిజాబ్ వివాదంతో గత కొన్ని రోజులుగా అట్టుడుకుతున్న కర్ణాటకలో మరో పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శివమొగ్గ జిల్లాలో బజరంగ్దళ్ కార్యకర్తను హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఘర్షణలకు దారితీసింది. దీంతో పోలీసులు ఆంక్షలు విధించారు. శివమొగ్గలోని భారతీకాలనీలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష (23)పై ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన హర్ష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
దీంతో ఆగ్రహావేశాలకు గురైన బాధితుడి సన్నిహితులు, బజరంగ్దళ్ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. సోమవారం ఉదయం పలు రహదారులను దిగ్బంధించారు. టైర్లు, వాహనాలకు నిప్పు పెట్టారు. రాళ్లు రువ్వారు. పరిస్థితులు అదుపుతప్పడంతో పోలీసులు నగరంలో 144 సెక్షన్ విధించారు. సోమవారం, మంగళవారం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు హోంమంత్రి జ్ఞానేంద్ర వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం లేకుండా చేస్తున్నాయని జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు.
ముస్లిం గూండాలే
బజరంగ్దళ్ కార్యకర్తను ముస్లిం గూండాలే హత్య చేశారంటూ పంచాయత్ రాజ్ మంత్రి, శివమొగ్గ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ రెచ్చగొట్టడంతోనే వాళ్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు ఆరోపించారు. బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యపై మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ స్పందించారు. 1948 జనవరి 30న ఒక హత్యతో (గాంధీజీ హత్యతో) మొదలైన ఈ హత్యా రాజకీయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
కేరళలో సీపీఎం కార్యకర్త హత్య
కేరళలోని కన్నూర్లో సీపీఎం కార్యకర్త దారుణహత్యకు గురయ్యారు. మృతుడిని హరిదాసుగా గుర్తించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యకర్తలే ఈ హత్యకు పాల్పడినట్టు సీపీఎం ఆరోపించింది. ఆరెస్సెస్ నాయకులు ఇటీవల చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలే హరిదాసు హత్యకు కారణమని సీపీఎం నేత జయరాజన్ ఆరోపించారు.