హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): విద్య విలువ తెలుసుకో, భవితకు బంగారు బాటలు వేసుకో అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఓ బాలుడికి సూచించారు. సోమవారం తుక్కుగూడ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు మంత్రి వెళ్లారు. అక్కడి మార్కెట్లో కూరగాయలు అమ్ముతూ కనిపించిన బాలుడి వద్దకు మంత్రి మాట్లాడారు. ‘ఏం బాబు ఇక్కడేం చేస్తున్నావ్.. స్కూల్ ఉంది కదా వెళ్లలేదా’ అంటూ ఆప్యాయంగా పలకరించారు. ‘కాలు నొస్తుంది మేడమ్’ అని ఆ బాలుడు చెప్పగా.. ‘ఏ కాలు.., అయినా కాలు నొప్పైతే కూరగాలెట్ల అమ్ముతున్నవ్, పదా డాక్టర్ దగ్గరికి వెళ్దాం.. ’అన్నారు. చదువుకుంటే ఇలా రోడ్డు మీద కూరగాయలు అమ్మాల్సిన పని ఉండదంటూ హితబోధ చేశారు. ఏ ఊరు మీది అని అడుగగా.. ఎస్డీ తండా అని చెప్పాడు. ఆ గ్రామ సర్పంచ్ మెగావత్ రాజునాయక్కు ఫోన్ చేసి, ఆ పంచాయతీలో పిల్లలు బడికెళ్లేలా చూడాలని సూచించారు. పిల్లలు ఉండాల్సింది పనిలో కాదని, బడిలో అనే విషయాన్ని తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత సర్పంచులపై ఉన్నదని సూచించారు.