న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ప్రైవేట్ రంగ సంస్థ యాక్సిస్ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,117.77 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,677.06 కోట్ల లాభంతో పోలిస్తే 54 శాతం అధికమైందని బ్యాంక్ వెల్లడించింది.
జనవరి-మార్చి మధ్యకాలానికిగాను బ్యాంక్ రూ.21,999.58 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.19,035.12 కోట్లుగా ఉన్నది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికిగాను రూ.82,597.37 కోట్ల ఆదాయంపై రూ.13,025 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకున్నది. బ్యాంక్ నిరర్థక ఆస్తుల విలువ 3.70 శాతం నుంచి 2.82 శాతానికి తగ్గగా..విలువ పరంగా చూస్తే రూ.25,314.84 కోట్ల నుంచి రూ.21,822.32 కోట్లకు తగ్గాయి. నికర ఎన్పీఏ 1.05 శాతం (రూ.6,993.52 కోట్లు) నుంచి 0.73 శాతానికి(రూ.5,512.16 కోట్లకు) దిగొచ్చాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.987.23 కోట్ల నిధులను వెచ్చించింది.