మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 25 : స్టార్టప్ సంస్థలను నెలకొల్పడంలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచిందని ప్రిన్సిపాల్ డాక్టర్ రామస్వామి రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్లో శుక్రవారం హైదరాబాద్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి కేంద్రం సమన్వయంతో స్టార్టప్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థని నెలకొల్పడం ద్వారా విద్యార్థి ఉద్యోగం ఆశించే స్థాయి నుంచి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదుగుతాడన్నారు. కళాశాల 12 స్టార్టప్లు నెలకొల్పడానికి సహకరించడం గొప్ప విషయమని ప్రశంసించారు. విద్యార్థుల 45 సృజనాత్మక ఆలోచనలకు పేటెంట్ చేయించామని, త్వరలో అవి కార్యరూపం దాల్చనున్నాయని తెలిపారు. ఎంఎస్ఎంఈ ఉప సంచాలకులు కేవీ రాము, టీ హబ్ ఉపాధ్యక్షుడు శ్రీరామ్ అయ్యర్, వాణిజ్య అభివృద్ధి అధికారి బంగారు శ్రీనివాస్ మాట్లాడుతూ టీ హబ్ ద్వారా అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలు, స్టార్టప్లో నెలకొల్పడానికి అందిస్తున్న సహకారాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఐఐసీ డీన్ డాక్టర్ వెంకట్రామయ్య, ఈడీసీ సమన్వయకర్త సరిత, ఎంఆర్ఈసీ హబ్ సమన్వయకర్త డాక్టర్ జాకీర్ హుస్సేన్, ఐఐసీ సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, విభాగాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.