న్యూఢిల్లీ: ఐపీఎల్లో మెరిసిన ఆటగాళ్లను భారత క్రికెట్ జట్టు అట్టి పెట్టుకుంటోంది. త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్లో అవసరమైతే వారి సేవలు వాడుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే జమ్ము కశ్మీర్ స్పీడ్స్టర్ ఉమ్రాన్ ఖాన్ను నెట్బౌలర్గా ఎంపిక చేయగా తాజాగా మరో పేస్ బౌలర్ అవేశ్ఖాన్ను కూడా తీసుకున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రాణిస్తున్న అవేశ్ ఖాన్ను యూఏఈలోనే ఉండాలని బోర్డు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. స్టాండ్ బై జాబితాలో ఉమ్రాన్ ఖాన్ తర్వాత రెండో ఫాస్ట్ బౌలర్గా ఆవేశ్ ఎంపిక కానున్నాడని తెలుస్తున్నది. ప్రస్తుతానికి నెట్ బౌలర్గా ఎంపికైనా, పరిస్థితులు కలిసొస్తే టీ20 ప్రపంచ కప్లో తుది జట్టులో అవకాశం కూడా దక్కవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ తరఫున ఆడిన అవేశ్ 23 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. నిలకడగా గంటకు 140కి.మీ పైగా వేగంతో ఖాన్ బంతులు విసురుతున్నాడు. మరోవైపు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం బ్యాటింగ్కే పరిమితమవుతుండటంతో అతడి స్థానంలో కోల్కతా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ను తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెన్నెముకకు శస్త్రచికిత్స తర్వాత పాండ్యా బౌలింగ్కు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో హార్దిక్కు బ్యాకప్గా అయ్యర్ను ఎంపిక చేసే చాన్స్ ఉన్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.