మంచిర్యాల అర్బన్ : ఈ నెల 27న హైదరాబాద్లో జరిగే ఆటో డ్రైవర్ల (Auto drivers ) ఆకలి కేక మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఆటో జేఏసీ ప్రణాళిక చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ (Mukesh Goud) కోరారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆటో యూనియన్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ( Mahalaxmi Scheme ) ఉచిత ప్రయాణం వల్ల ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆటో జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు కలుపుకొని ఆటో కార్మికుల ఆకలి కేక యాత్ర ను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. యాత్ర ముగింపు సందర్భంగా మే 27 చలో హైదరాబాద్ ఆటో కార్మికుల ఆకలి కేక మహాసభ ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు, కార్మికులు, నాయకులు వేలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఇప్పటికైనా ఆటో కార్మికులకు ప్రతినెల రూ.12 వేలు, ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా రూ.1000 కోట్లు, ఆటో కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులు సహజ మరణం చెందితే రూ.ఐదు లక్షల ఇచ్చి ఆదుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బెల్లంకొండ మురళీధర్, పొట్ట మధుకర్, కల్వల అంజయ్య, పగడాల రాజేష్, ఎండి షఫీ, తగరం శ్రీనివాస్, మంతెనగట్టయ్య, కలవేని శేఖర్, బోరే వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.