Australia Terror Attack | ఆస్ట్రేలియాలోని బౌండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సాజిద్ అక్రమ్కు హైదరాబాద్తో సంబంధాలు ఉన్నట్లుగా ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. అతని దగ్గర హైదరాబాద్ పాస్పోర్టు లభ్యమైంది. ఈ నేపథ్యంలో సాజిద్ అక్రమ్ గురించి కీలక విషయాలను తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు.
సాజిద్ అక్రమ్ హైదరాబాద్లోనే బీకామ్ పూర్తి చేశాడని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. స్టూడెంట్ వీసాపై 1998 నవంబర్లో ఆస్ట్రేలియాకు వెళ్లాడని పేర్కొన్నారు. అక్కడే యూరప్లోని ఇటలీకి చెందిన వెనీరా గ్రాసోను వివాహం చేసుకున్నాడని పేర్కొన్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారని చెప్పారు. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత 2001లో తన వీసాను పార్టనర్ వీసాగా మార్చుకున్నాడు.. 2002లో రెసిడెంట్ వీసాను పొందినట్లు తెలిసింది. ఇప్పటికీ సాజిద్ ఇండియన్ పాస్పోర్టు కలిగి ఉన్నాడని.. అతని పిల్లలు మాత్రం ఆస్ట్రేలియా పౌరసత్వం ఉందని చెప్పారు.
గడిచిన 25 ఏళ్లలో సాజిద్ ఆరుసార్లు మాత్రమే ఇండియాకు వచ్చాడని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 2017లో తండ్రి చనిపోయిన సమయంలో ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళ్లాడని పేర్కొన్నారు. 2022లో హైదరాబాద్లోని టోలీచౌకీలో ఉన్న ఆస్తులను అమ్ముకొని వెళ్లినట్లు చెప్పారు. తెలంగాణలో సాజిద్పై ఎలాంటి క్రైమ్ రికార్డ్స్ లేవని వెల్లడించారు.