మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో ఏడోసారి మహిళల వన్డే ప్రపంచకప్ను ముద్దాడింది. రికార్డులు తిరుగ రాయడమే పనిగా పెట్టుకున్న ఆలీసా హీలీ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆస్ట్రేలియా కొండంత స్కోరు చేస్తే.. భారీ లక్ష్యఛేదనలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ పోరాడినా ఫలితం లేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన కంగారూలు.. ఇంగ్లిష్ ప్లేయర్లకు ఏడుపు మిగిలిస్తూ.. ఏడోసారి వరల్డ్కప్ చేజిక్కించుకున్నారు!
క్రైస్ట్చర్చ్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆసీస్ 71 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఏడోసారి ట్రోఫీని ముద్దాడింది. స్టార్ ఓపెనర్ అలీసా హీలీ (138 బంతుల్లో 170; 26 ఫోర్లు) భారీ శతకంతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 356 పరుగులు చేసింది. రాచెల్ హేన్స్ (68), బెత్ మూనీ (62) అర్ధశతకాలతో రాణించారు. తొలి వికెట్కు హేన్స్తో కలిసి 160 పరుగులు జోడించిన హీలీ.. రెండో వికెట్కు మూనీతో 156 రన్స్ జత చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ష్రబ్సోల్ మూడు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్.. 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. స్కీవర్ (121 బంతుల్లో 148 నాటౌట్; 15 ఫోర్లు, ఒక సిక్సర్) చివరి వరకు పోరాడగా.. మిగిలిన ప్లేయర్ల నుంచి ఆమెకు సహకారం లభించలేదు. ఆసీస్ బౌలర్లలో అలాన్ కిం గ్, జెస్ జాన్సెన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మెగాటోర్నీ మొత్తంలో 509 పరుగులు చేసిన హీలీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. గత ప్రపంచకప్తో పోలిస్తే నగదు బహుమతి రెండింతలు పెరుగగా.. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు రూ. 10 కోట్లు, రన్నరప్ ఇంగ్లండ్ జట్టుకు రూ. 4.55 కోట్ల ప్రైజ్మనీ లభించింది.
ఆస్ట్రేలియా: 50 ఓవర్లలో
356/5 (హీలీ 170,
హేన్స్ 68; ష్రబ్సోల్
3/46), ఇంగ్లండ్:
43.4 ఓవర్లలో
285 ఆలౌట్ (స్కీవర్
148 నాటౌట్; జెస్
జాన్సన్ 3/57,
అలెన్ కింగ్ 3/64).