నైపితా: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీని జైలు తరలించారు. ఇన్నాళ్లూ గృహనిర్బంధంలో ఉన్న ఆమెను రాజధాని నైపితాలో ఉన్న జైలుకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.గత ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్ ప్రభుత్వాన్ని మిలిటరీ చేజిక్కించుకున్న తర్వాత 77 ఏళ్ల సూకీని హౌజ్ అరెస్టు చేశారు. నోబెల్ గ్రహీత సూకీని ఇన్నాళ్లు గుర్తు తెలియని లొకేషన్లో దాచిపెట్టారు. సూకీకి 11 ఏళ్ల జైలుశిక్షను ఖరారు చేశారు. ఆమెపై పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అన్ని ఆరోపణలను ఆమె ఖండించారు. మయన్మార్ నేర చట్టాల ప్రకారమే సూకీని జైలుకు తరలించినట్లు మిలిటరీ ప్రభుత్వం తెలిపింది.
ఒకవేళ ఆమెపై ఉన్న ఆరోపణలన్నీ రుజువైతే సూకీకి సుమారు 190 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. జాతీయ ఎన్నికల్లో ఎన్ఎల్డీ పార్టీ ఘన విజయం సాధించినా.. ఆ ఎన్నికల్లో భారీగా ఫ్రాడ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సైన్యం ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నది. గత ఏడాది నుంచి సూకీతో పాటు 14వేల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిలిటరీ అణిచివేతలో సుమారు రెండు వేల మంది మరణించారు.