భైంసాటౌన్ : సమస్యలపై నిలదీసినందుకు ఇటీవల గ్రామస్తుడిపై దాడి చేసిన సర్పంచ్ ఘటన మరవకముందే నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగాం(బీ) గ్రామంలో సర్పంచ్పై దాడి జరిగిన ఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ అప్పాల రాకేశ్ అభివృద్ధి పనులు నాణ్యతగా చేపట్టకుండా నిధులు దుర్వినియోగం చేశారని, గ్రామపంచాయతీ ట్రాక్టరు సొంత పనులకు వినియోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జిల్లా అదనపు పాలనాధికారికి ఉప సర్పంచ్ కోటగిరి శారద, ఎంపీటీసీ కోటగిరి పోశెట్టి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం విచారణ నిమిత్తం గ్రామానికి వచ్చిన డీఎల్పీవో శివకృష్ణ, పంచాయతీ రాజ్ ఏఈ ఉదయ్ విచారణ చేపట్టారు.
విచారణ కొనసాగుతుండగానే ఉపసర్పంచ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, గ్రామంలో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని సర్పంచ్ పేర్కొనడంతో అతడిపై ఉపసర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు ఒకరినొకరు దూషణకు దిగారు. దీంతో ఆగ్రహించిన ఉపసర్పంచ్ శారద సర్పంచ్ను చెప్పుతో కొట్టగా, ఎంపీటీసీ కాలుతో తన్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారి పరస్పర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అక్కడి పంచాయతీ కార్యదర్శిపై సైతం దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో విచారణ అర్ధాంతరంగా నిలిచిపోయింది.
సమాచారం అందుకున్న గ్రామీణ పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం కొందరు యువకులు సర్పంచ్ ఇంటికి వెళ్లి ఆయన తల్లిపై దాడి చేశారు. దీంతో అక్కడ పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఒకరిపై ఒకరు చేసుకున్న ఫిర్యాదులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై జాదవ్ బాలుసింగ్ తెలిపారు.