ఖలీల్వాడి, అక్టోబర్ 13: తన కూతురిని మోసం చేశాడంటూ ఓ మహిళ నిజామాబాద్లో బీజేపీ కార్పొరేటర్ భర్తపై చెప్పుతో దాడి చేశారు. తన కూతురిని బ్లాక్మెయిల్ చేసి లోబర్చుకున్నాడని వాపోయిన ఆమె.. కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం కార్పొరేటర్ ఇంటిముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వివరాలు ఇలా.. వినాయక్నగర్లో నివాసం ఉండే కార్పొరేటర్ భర్త, బీజేపీ నేత ఆకుల శ్రీనివాస్.. వైద్యురాలైన తమ కూతురిని బ్లాక్మెయిల్ చేసి లోబర్చుకున్నాడని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. గతంలోనూ ఈ విషయమై మందలించినా శ్రీనివాస్ తీరులో మార్పు రాలేదన్నారు. అతడికి భార్యాపిల్లలు ఉన్నా తమ కూతురికి మాయమాటలు చెప్పి మోసం చేశాడంటూ వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యులు బుధవారం బీజేపీ కార్పొరేటర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమ కూతురిని అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భార్య ముందే శ్రీనివాస్ను బాధితురాలి తల్లి చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ఘటనపై బీజేపీ నేత ఆకుల శ్రీనివాస్ ఇంతవరకు స్పందించలేదు.