ఊట్కూర్, నవంబర్ 28: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని నాగిరెడ్డిపల్లిని ఆనుకొని ప్రవహిస్తున్న పెద్దవాగులో ఇసుక తెచ్చేందుకు వెళ్లిన వారిపై పొరుగునే ఉన్న కర్ణాటకలోని చేలేరు గ్రామస్థులు దాడులకు తెగబడ్డారు. నాగిరెడ్డిపల్లి-చేలేరు మధ్య ఉన్న పెద్ద వాగు పూర్తి గా తమదేనంటూ కర్ణాటక వాదిస్తున్నది. ఆదివారం ఉదయం మల్లేపల్లి, నాగిరెడ్డిపల్లికి చెందిన కొందరు.. తమ అవసరాల కోసం ఇసుకను తెచ్చేందుకు ట్రాక్టర్లతో వాగులోకి వెళ్లారు.
అప్పటికే అక్కడ వందల సంఖ్యలో ఉన్న చేలేరు గ్రామస్థులు.. కర్ణాటక పోలీసుల సమక్షంలోనే దాడులకు దిగారు. కర్రలతో కొట్టడంతో పలువురికి గాయాలు కాగా, ట్రాక్టర్లు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న ఊట్కూర్ ఎస్సై పర్వతాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.