అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చల అనంతరం ఉద్యోగులు తమ సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. చర్చలు సఫలం కావడంతో కార్మిక సంఘాలు ఆదివారం సీఎం జగన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా డిమాండ్లను అంగీకరించినందుకు సీఎం వైఎస్ జగన్కు యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్తో సమావేశం సందర్భంగా మాకు ఏ సమస్య ఉన్నా తనతో కలిసి చెప్పుకోవచ్చునని చెప్పడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం ప్రకటించారు. జగన్తో సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు మంత్రుల కమిటీ అలాగే ఉంటుందని చెప్పారన్నారు. సీసీఎస్ రద్దు విషయంలో సీఎం జగన్ స్పష్టత ఇచ్చారని చెప్పారు. మా ఇబ్బందులను అర్థం చేసుకున్నానని, ప్రభుత్వంపై భారం పడినా భరిస్తామని సీఎం చెప్పారని పేర్కొన్నారు. ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లుగా మాపై నమ్మకంతో వేలాదిగా ఉద్యోగులు విజయవాడకు తరలిరావడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. హక్కుల సాధన కోసం మున్ముందు కూడా ఉద్యోగులందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఇలాఉండగా, ప్రభుత్వంతో ఉపాధ్యాయుల చర్చలు విఫలమయ్యాయని ఏపీటీఎఫ్ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయనున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పీఆర్సీ సాధన కమిటీ చర్చలు తమకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. త్వరలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. హెచ్ఆర్ఏ, ఫిట్మెంట్ విషయాల్లో తాము తీవ్రంగా విభేదించామని, పాత హెచ్ఆర్ఏనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఫిట్మెంట్ విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.