హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 13 : టీఆర్ఎస్ కార్యకర్తపై హత్యాయత్నం చేసి పరారీలో ఉన్న బీజేపీ నాయకుడు అనూహ్యంగా పట్టుబడ్డాడు. లక్ష రూపాయలను తరలిస్తూ ఫ్లయింగ్ స్కాడ్కు చిక్కాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 10న రాత్రి హుజూరాబాద్ మండలం బోర్నపల్లికి చెందిన బీజేపీ నాయకులు నాంపల్లి సుమన్, అంగీర రాజు, నిమ్మ సంజీవ్ అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నాంపెల్లి జగన్ ఇంటికి వెళ్లి దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రాజు, సంజీవ్ను కోర్టులో హాజరు పరిచారు. సుమన్ పరారీలో ఉన్నాడు. బుధవారం హుజూరాబాద్ మండలం చెల్పూర్ సమీపంలో ఫ్లయింగ్ స్కాడ్ ఓ కారును తనిఖీ చేశారు. అందులో కమలాపూర్ మండల మర్రిపెల్లిగూడెంకు చెందిన మోతె జగదీశ్వర్, బోర్నపల్లికి చెందిన నాంపల్లి సుమన్ వద్ద రూ.లక్ష దొరికింది. డబ్బుకు సంబంధించి సరైన వివరాలు చెప్పకపోవడంతో ఇద్దరిని హుజూరాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు నగదు సీజ్ చేశారు. జగన్పై దాడి కేసులో పరారీలో ఉన్న నాంపల్లి సుమన్ను కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్టు ఎస్సై శేఖర్ తెలిపారు.