హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఒకరిని దుర్భాషలాడేముందు మనకు ఆ అర్హత ఉన్నదా? మన స్థాయి ఏమిటి? అని ఒకసారి తరచి చూసుకోవడం సంస్కారం. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకొంటున్న నేతలకు ఇలాంటి సంస్కారం ఏ కోశానా లేనట్టు కనిపిస్తున్నది. గురివింద గింజల్లా ప్రవర్తిస్తూ.. సీఎం కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శించేందుకే పరిమితమవుతున్నారు. ఆదివారం వరంగల్ జిల్లాకు వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సైతం ఈ ముఠాలోనే చేరారు. ఇతర బీజేపీ నేతల మాదిరిగానే పచ్చి అబద్ధాలను వల్లె వేశారు. సీఎం కేసీఆర్ను తిట్టి నలుగురి దృష్టిలో పడితే చాలన్నట్టు వ్యవహరించారు.
హిమంత పలుకు: సీఎం కేసీఆర్కు పోలీసులు తప్ప ఎవరూ సపోర్ట్ లేరు. ఆయన ప్రజలకు భయపడుతున్నారు.
వాస్తవం: దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ ఎలా ఉన్నదో ఇటీవలి ఉప ఎన్నికలే సాక్ష్యం. రైతులకు భయపడి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నది ఎవరో.. పంజాబ్ లో భయపడి పారిపోయింది ఎవరో అందరికీ తెలుసు.
హిమంత పలుకు: నిజాం, ఔరంగజేబు వారసత్వాన్ని కేసీఆర్ కొనసాగిస్తున్నారు. సర్దార్ వల్లభాయ్పటేల్, కాకతీయ రాజులు మాకు ఆదర్శం.
వాస్తవం: తెలంగాణ ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ను కొలుస్తారు. ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు సేవ చేసిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ను కొలుస్తారు. కాకతీయ రాజులను కొలుస్తారు. అదే సమయంలో వారి పై పోరాడిన సమ్మక్క, సారలమ్మలను దేవతలుగా పూ జిస్తారు. రజాకార్ల దౌర్జన్యాలను ఎలా వ్యతిరేకించా రో.. అలాగే విద్వేష రాజకీయాలు చేస్తున్న బీజేపీపైనా పోరాడుతారు. అంతేతప్ప చరిత్రలో గీతలు గీయరు.
హిమంత పలుకు: తెలంగాణ రాష్ట్రం వద్దన్న లెఫ్ట్ పార్టీలను ఇంటికి పిలిచి కేసీఆర్ దావత్ ఇచ్చారు.
వాస్తవం: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి, ఏర్పాటుకు ద్రోహం చేసిన పార్టీల్లో బీజేపీ కూడా ఉన్నది. ఒక ఓటు రెండు రాష్ర్టాలు అని సిద్ధాంతం చెప్పి దానిని పక్కన పడేసింది బీజేపీది కాదా? రాజధాని ఉన్న ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు? అని స్వయంగా అద్వానీ అనడం వాస్తవం కాదా? హైదరాబాద్ నడిగడ్డపైన ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ.. తెలంగాణ ఏర్పాటుపై.. ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అని వ్యాఖ్యానించిన మాటను తెలంగాణ ప్రజలు మరచిపోగలరా? సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సమాజం మొత్తం ఉద్యమించడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే పరిస్థితులు వచ్చాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బీజేపీ మద్దతు ఇచ్చింది.
హిమంత పలుకు: ప్రజలకోసం పోరాటం చేసి జైలుకు వెళ్తే చరిత్రకారుడు అవుతారు.
వాస్తవం: తెలంగాణ ప్రజల కోసం పోరాడి జైలుకు పోయినవారు టీఆర్ఎస్లో లక్షల్లో ఉన్నారు. స్వరాష్ట్రంలోనే ప్రజలు బాగుపడుతారనే ఉద్దేశంతో ఉద్యమించి జైళ్లకు వెళ్లారు. అంతేతప్ప.. మీలాగా కాంగ్రెస్లో ఉండి కుంభకోణాలు చేసి.. జైలుకుపోయే దశలో బీజేపీలో చేరి సీఎం అయిన దుర్మార్గపు చరిత్ర టీఆర్ఎస్ నేతలకు లేదు.
హిమంత పలుకు: తెలంగాణతో పోల్చుకొంటే అస్సాం చిన్న రాష్ట్రం. మా రాష్ట్రంలో ఒకే సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు ఇచ్చాం.
వాస్తవం: ప్రస్తుతం తెలంగాణ జనాభా దాదాపు 4 కోట్లు. అస్సాం జనాభా 3.6 కోట్లు. తెలంగాణ వైశాల్యం 1.12 లక్షల చదరపు కిలోమీటర్లు. అస్సాం విస్తీర్ణం దాదాపు 80వేల చదరపు కిలోమీటర్లు. అంటే.. ఏ విధంగా చూసుకున్నా రెండు రాష్ర్టాల మధ్య వ్యత్యాసం కేవలం 25-30శాతం. మరి తెలంగాణ తలసరి ఆదా యం రూ.2.37 లక్షలు ఉంటే అస్సాంలో రూ. 1.30 లక్షలు మాత్రమే ఎందుకు ఉన్నది? తెలంగాణ జీఎస్డీపీ దాదాపు రూ.9.80లక్షల కోట్లు ఉంటే.. అస్సాం మాత్రం ఎందుకు రూ.4.10 లక్షల కోట్ల దగ్గరే ఆగిపోయింది? తెలంగాణ ఇప్పటివరకు 1.30 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. ఉద్యోగుల విభజన పూర్తికాగానే మరో దాదాపు లక్ష పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ వాస్తవాలను మరుగునపర్చి.. నిరుద్యోగుల ఆశలతో రాజకీయ వ్యాపారం చేయడమే పరమావధిగా బీజేపీ తయారైంది.
హిమంత పలుకు: ప్రధాని మోదీ దేశం కోసం తన జీవితాన్ని సమర్పిస్తే.. సీఎం కేసీఆర్ తన కొడుకు కోసం సమర్పిస్తున్నారు..
వాస్తవం: ప్రధాని మోదీ తన జీవితాన్ని దేశం కోసం సమర్పిస్తున్నారో.. కార్పొరేట్ల కోసం సమర్పిస్తున్నారో దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. దేశాభివృద్ధికి ఇంజిన్లుగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నది ఎవరో అస్సాం సీఎం చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలను తాకట్టుపెట్టి స్వరాష్ర్టాన్ని సాధించారని, ఏడేండ్లలోనే అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపారని తెలంగాణ ప్రజలకే కాదు.. దేశం మొత్తానికి తెలుసు.