Asian Champion Trophy 2023 | సొంతగడ్డపై జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో ఆతిథ్య భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో శనివారం టీమ్ఇండియా 4-3తో మలేషియాను మట్టికరిపించి నాలుగోసారి ట్రోఫీ చేజిక్కించుకుంది. ఇక ఈ మ్యాచ్కు తమిళనాడు సీఎం స్టాలిన్తో పాటు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియం మొత్తం వందేమాతరం నినాదాలతో మార్మోగిపోయింది. వందేమాతరం, వందేమాతరం అంటూ ఈలలు, కేరింతలతో అభిమానులు స్టేడియంను హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ తరఫున జుగ్రాజ్ సింగ్ (9వ నిమిషంలో), కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (45వ ని.లో), గుర్జాంత్ సింగ్ (45వ ని.లో), ఆకాశ్దీప్ సింగ్ (56వ ని.లో) ఒక్కో గోల్ నమోదు చేశారు. తొలి అర్ధభాగంలో మలేషియా రెచ్చిపోతే.. సెకండ్ హాఫ్లో మనవాళ్లు విజృంభించారు. మలేషియా తరఫున అబు కమల్ అజారి (14వ ని.లో), రాజీ రహీం (18వ ని.లో), మహమ్మద్ అమీనుద్దీన్ (27వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. టోర్నీ ఆసాంతం వీరవిహారం చేసిన టీమ్ఇండియా స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. మలేషియాకు రజతం దక్కింది.
భారత సారథి హర్మన్ప్రీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు దక్కింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, తమిళనాడు సీఎం స్టాలిన్ విజేతలకు బహుమతులు అందించారు.
The chants of Vande Mataram fill the stadium after India comes back into the game. #HockeyIndia #IndiaKaGame #HACT2023 pic.twitter.com/Mn5ccxSG4A
— Hockey India (@TheHockeyIndia) August 12, 2023