ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక జట్టు అద్భుతంగా రాణించి ట్రోఫీ ముద్దాడింది. ఈ విజయంలో స్టార్ బ్యాటర్ భానుక రాజపక్స పాత్ర చాలా ఉంది. జట్టు 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో ఇన్నింగ్స్ చక్కిదిద్దిన అతను 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో లంక జట్టు 170 పరుగుల పోరాడగలిగే స్కోరు చేసింది.
అనంతరం బౌలర్లు కూడా అద్భుతంగా రాణించడంతో పాక్ను కేవలం 147 పరుగులకే ఆలౌట్ చేసి ఆసియా కప్ ఎగరేసుకుపోయింది. దీనిపై పాక్ మాజీ లెజెండ్ ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ.. రాజపక్స గనుక కొంచెం నెమ్మదిగా ఈ పరుగులు చేసి ఉంటే వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండేది కాదన్నాడు. ఈ ఇన్నింగ్స్లో రాజపక్స స్ట్రైక్రేట్ 157.78 కావడం గమనార్హం.
ఇదే విషయాన్ని ఎత్తిచూపిన ఇంజమామ్.. ‘హసరంగ చేసిన 36 పరుగులు, రాజపక్స చేసిన 71 పరుగులు చాలా మంచి ఇన్నింగ్స్లు. వాళ్లు ఈ పరుగులు వేగంగా కూడా చేశారు. అంత క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా ఆడటం నిజంగా గొప్ప విషయం. రాజపక్స చేసిన పరుగులు నెమ్మదిగా వచ్చుంటే ఆ జట్టు అటూఇటుగా 140 పరుగులు మాత్రమే చేసుండేది. ఆ స్కోర్ను పాక్ ఛేజ్ చేసేసేది.
అప్పుడు రాజపక్స చేసిన స్కోరు దేనికీ ఉపయోగపడేది కాదు’ అని వివరించాడు. అదే సమయంలో శ్రీలంక పేసర్లు అందరూ యువకులేనని, అయితే వారంతా కూడా తమ హోం వర్క్ చక్కగా చేసుకొని వచ్చారని కొనియాడాడు. ఈ టోర్నీలో పాక్ మెరుగ్గా ఆడిందని, కానీ జట్టు ఆటతీరు అంతగొప్పగా లేదని చెప్పాడు. జట్టులో ఉన్న చాలా లోపాలు బట్టబయలు అయ్యాయని, ప్రత్యర్థి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ పరిస్థితిని ఉపయోగించుకునే సత్తా జట్టులో కనిపించలేదని పాక్ను విమర్శించాడు.