Ravichandran Ashwin : క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) రేపటితో మొదలవ్వనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఈ ఫైనల్ ఫైట్లో ఢీ కొంటున్నాయి. భారత జట్టు ఇద్దరు స్పిన్నర్లతో ఆడుతుందా? లేదంటే రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin), రవీంద్ర జడేజా(Ravindra Jadeja)లో ఎవరిని పక్కన పెడతారు? అనే చర్చలు నడుస్తున్న వేళ.. అశ్విన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడడం తన కెరీర్లో పెద్ద మ్యాచుల్లో ఒకటి అని అతను అన్నాడు. ‘ఇది మాకు రెండో డబ్ల్యూటీసీ ఫైనల్. రేపటి టైటిల్ పోరు కోసం ఓవల్ పిచ్ను సిద్ధం చేస్తున్నారు. ఆసీస్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఆడడం నా కెరీర్లో పెద్ద మ్యాచుల్లో ఒకటి’ అని ఈ ఆఫ్ స్పిన్నర్ తెలిపాడు.
అంతేకాదు ఈ ఏడాది టీమిండియా రెండు ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)లపై గురి పెట్టిందని తెలిపాడు. ‘ఈ ఏడాది భారత జట్టుకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే..? రెండు ఐసీసీ ట్రోఫీలపై మేము గురి పెట్టాం. ఒకటి డబ్ల్యూటీసీ ఫైనల్, రెండోది స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్ కప్(ODI WC 2023). టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు చాలామంది భారతీయులు రానున్నారు. అయితే.. మేము ఫైనల్లో ఆడడం చూసేందుకు పాసెస్ కావాలని మొదటిసారి ఎక్కువ మంది మమ్మల్ని ఆడుగుతున్నారు’ అని అశ్విన్ తెలిపాడు.
రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్
డబ్ల్యూటీసీ సీజన్లో అశ్విన్ వికెట్ల వేట కొనసాగించాడు. 2021 – 23 వరకు టెస్టుల్లో భారత బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసింది అతడే. ఈ ఆఫ్ స్పిన్నర్ 61 వికెట్లతో టాప్లో ఉన్నాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా 45 రెండో స్థానంలో, జడేజా 43 వికెట్లతో మూడో స్థానంలో నిలిచారు. సీనియర్ పేసర్ షమీ 41, సిరాజ్ 31 వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియాతో ఫిబ్రవరిలో జరిగిన బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy)లో అశ్విన్ చెలరేగాడు. ఏకంగా 25 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు.