నారాయణపేట : తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari ) ఇంటిని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ( Asha Workers ) ముట్టడించారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే కోరుతూ పెద్ద సంఖ్యలో ఆశా కార్యకర్తలు అక్కడికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని రోజులుగా ఆశా కార్యకర్తల సమస్యలపై పోరాటాలు చేస్తున్నా గాని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఐటీయూ నాయకులు ఆరోపించారు.
ఆశా వర్కర్లకు రూ. 18 వేలు వేతనం వెంటనే అమలు చేయాలని, ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆశా వర్కర్లపై పెరుగుతున్న పనిభారం తగ్గించి, అదనపు భత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఆశా వర్కర్లకు కూడా వర్తింపజేయాలన్నారు. గర్భిణిలు, శిశు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశాలకు ప్రత్యేక గౌరవ వేతనం ఇవ్వాలి. ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సదుపాయాలు కల్పించాలన్నారు.