న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచనున్నారు. అయితే ఆయనను పదిరోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ కేసులో తొలి ఎఫ్ఐఆర్ను సీబీఐ నమోదు చేసింది. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా 14 మందిని నిందితులుగా పేర్కొన్నది. ప్రస్తుతం సిసోడియా తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను బుధవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వరణకాంత శర్మ విచారించారు. తన అరెస్టు అక్రమమని, వెంటనే తనను విడుదల చేస్తూ మధ్యంతర ఉపశమనం కల్పించాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు. ఆధారాల కోసం తనను అరెస్టు చేయలేదని, కేవలం తనను, తన పార్టీని నిర్వీర్యం చేయడానికే అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఏప్రిల్ 2 లోగా స్పందన తెలియజేయాల్సిందిగా ఈడీని కోర్టు ఆదేశిస్తూ ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ సతీమణి సునీత సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మద్యం విధానానికి సంబంధించి నిజానిజాలను తన భర్త కేజ్రీవాల్ గురువారం (మార్చి 28) కోర్టులో బయటపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె బుధవారం వీడియో సందేశం విడుదల చేశారు. ‘మద్యం కేసుకు సంబంధించి గడిచిన రెండేండ్లలో ఈడీ ఇప్పటివరకు 250 సార్లు సోదాలు జరిపినట్టు కేజ్రీవాల్ చెప్పారు. అయితే, ఇప్పటివరకూ ఎందులోనూ వారికి ఏమీ దొరకలేదు. మా ఇంట్లోనూ ఈడీ సోదాలు జరిపింది. అయితే కేవలం రూ. 73 వేలు మాత్రమే దొరికాయి. మద్యం కేసులో కుంభకోణం జరిగినట్టు చెప్తున్నారు కదా? మరి ఆ డబ్బంతా ఏమయ్యింది? ఈ కేసుకు సంబంధించి అన్ని నిజాలను కోర్టులో బయటపెడతానని కేజ్రీవాల్ నాతో చెప్పారు. లిక్కర్ పాలసీ డబ్బు ఎక్కడుందో ఆయన జడ్జి ముందు చెప్తారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారు’ అని సునీత వీడియోలో వెల్లడించారు.