Voice Cloning | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): డీప్ఫేక్ వీడియోల కలకలం ఒకవైపు కొనసాగుతుండగానే వాయిస్ క్లోనింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో నకిలీ వాయిస్ను సృష్టించడమే ‘వాయిస్ క్లోనింగ్’గా నిపుణులు చెప్తున్నారు. నకిలీ వాయిస్తో ఆర్థిక నేరాలకు పాల్పడటమే దీని ఉద్దేశమని వెల్లడిస్తున్నారు.
ఎలా మభ్యపెడతారు?
లక్షిత వ్యక్తికి సంబంధించిన వాయిస్ను తొలుత ఏఐ సాయంతో ట్రైన్ (తర్ఫీదునిచ్చి) చేసి అసలు వాయిస్గా భ్రమించేలా క్లోనింగ్ చేస్తారు. తర్వాత సదరు వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆప్తుల ఫోన్ నంబర్లకు కాల్స్ చేసి ఆ వ్యక్తి మాట్లాడినట్టుగా ఫేక్ సంభాషణను కొనసాగిస్తారు. ‘ఆపదలో ఉన్నాం. వెంటనే ఈ నంబర్కు డబ్బులు పంపించా’లంటూ విజ్ఞప్తి చేస్తారు. డబ్బులు పంపించే వరకూ పలువిధాలుగా మభ్యపెడతారు. ఆత్మీయులే ఫోన్ చేశారు కదా అంటూ అలా పలువురు పెద్దమొత్తంలో డబ్బు పంపించిన ఉదంతాలు అమెరికాతో పాటు ఇప్పటికే పలు దేశాల్లో వెలుగుచూశాయి కూడా. అమెరికాలోని ఓ కంపెనీకి చెందిన సీఈవో ఇలా మోసపోయే ఏకంగా 2.43 లక్షల డాలర్లను నేరగాళ్లకు పంపించినట్టు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కూడా వాయిస్ క్లోనింగ్ సెగ ఇటీవల తగిలింది. ఈ సంవత్సరం చివర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం అమెరికాలో ప్రైమరీ పోల్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఓటర్లకు బైడెన్ చెప్పినట్టుగా ముందుగా రికార్డు చేసిన కొన్ని ఫేక్ ఫోన్ కాల్స్ పలువురికి వెళ్లాయి. ‘ఈ ఎన్నికల్లో ఓటు వేయొద్ద’ని బైడెన్ ఓటర్లను కోరినట్లు ఆ ఆడియోలో ఉన్నది. ఏఐ ఆధారంగా సృష్టించిన ఈ ఫేక్ కాల్స్పై వైట్హౌస్ ఆందోళన వ్యక్తం చేసింది. వాయిస్ క్లోనింగ్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తతతో ఉండాలని, అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.