రవీంద్రభారతిలో చిత్రకళా ప్రదర్శన. రామాయణ, భారత భాగవత ఘట్టాలు అనేకం. అన్నీ బాపు బొమ్మలే. కానీ,గీసింది మాత్రం.. ఖమ్మం జిల్లాకు చెందిన తేజశ్రీ. ఆ అమర చిత్రకారుడికి గీతపూర్వక నివాళి సమర్పించిందామె. బాపు శైలితో తన అనుబంధాన్ని ‘జిందగీ’తో ఇలా పంచుకొన్నది..
మాది ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలి. ఐదో తరగతి నుంచే బొమ్మలు వేస్తున్నాను. చదువుతో పాటు చిత్రకళకూ ప్రాధాన్యం ఇచ్చాను. మాది మధ్యతరగతి కుటుంబమే అయినా, అమ్మానాన్న నాలోని కళను గుర్తించి ప్రోత్సహించారు. బాపు బొమ్మల్లో జీవం ఉట్టిపడుతుంది. ఆయన ప్రతీ చిత్రంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఇమిడి ఉంటాయి. అందుకే నాదైన శైలిని మెరుగు పరుచు కుంటూనే, బాపు బొమ్మలను వేయడం ప్రారంభించాను.
నివాళిగా..
నేను ప్రస్తుతం ఎంటెక్ చేస్తున్నాను. బొమ్మలు వేయడం ఒకెత్తు అయితే వాటిని ప్రదర్శనకు పెట్టడం ఇంకో ఎత్తు. బాపు పుట్టినరోజు, నా పుట్టినరోజు.. ఒకేరోజు కావడం విశేషం. ఆ మహా చిత్రకారుడి జయంతిని ఘనంగా జరపాలనే ఉద్దేశంతో బాపు బొమ్మలనే నమూనాగా ఎంచుకొని రవీంద్రభారతిలో ప్రదర్శనకు పెట్టాను. విభిన్నమైన 300 చిత్రాలతో నా ప్రదర్శన ప్రారంభమైంది. గిరిజనుల జీవితాలను చిత్రించాలన్నది నా కల. ప్రస్తుతం అదే ప్రాజెక్ట్పై పనిచేస్తున్నాను. నా భర్త మురళీకృష్ణ నా ప్రతీ అడుగులో తోడుగా ఉంటున్నారు.