అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, బాపట్ల జిల్లాలో టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆ రెండు జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. పల్నాడు జిల్లా జంగమేశ్వరపాడులో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య అంత్యక్రియల్లో టీడీపీ నాయకులు పాల్గొనకుండా నరసారావుపేటలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు వస్తున్నారని అప్పటి వరకు పోస్టుమార్టం చేయవద్దని మృతుడి కుటుంబ సభ్యులు చేసిన విన్నపాలను పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు.
టీడీపీ నాయకులు వస్తే సమస్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తాయన్న అనుమానంతో పోస్టుమార్టం అనంతరం హడావుడిగా మృతదేహాన్ని మృతుడి స్వగ్రామానికి తరలించారు. టీడీపీఅధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు మృతుని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ముగ్గురు సభ్యుల బృందం కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర, బుద్ధ వెంకన్న జిల్లా ముఖ్య నేతలకు ఆదేశించారు. దీంట్లో భాగంగా విజయవాడలో టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు గృహనిర్బంధించారు.
బాపట్ల జిల్లా సంతమాగులూరు వద్ద బీదా రవిచంద్రను పోలీసులు అడ్డుకున్నారు. జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఆయనను అరెస్టు చేసి వినుకొండ పోలీస్స్టేషన్కు తరలించారు. మరోవైపు కాకినాడ జిల్లా పిఠాపురంలో తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ.. దళిత గర్జనకు అనుమతులు లేవంటూ వర్మను పోలీసులు నిన్న రాత్రే గృహ నిర్బంధం చేశారు.