సిటీబ్యూరో, డిసెంబరు 30(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగర వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల వ్యాక్సినేషన్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జనవరి 3 నుంచి పిల్లలకు సైతం కరోనా టీకా వేయనున్నట్లు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గ్రేటర్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పిల్లల వ్యాక్సినేషన్పై ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రస్తుతం 15 యేండ్ల నుంచి 18 యేండ్ల లోపు పిల్లలకు టీకా ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన ప్రకటన మేరకు గ్రేటర్ అధికారులు పిల్లల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే కరోనా టీకా వేయడంపై అనుభవం ఉన్న సిబ్బందిలో కొంత మంది సిబ్బందికి పిల్లల వ్యాక్సినేషన్పై కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అంతే కాకుండా, టీకా ఇచ్చే కేంద్రాలు, నిలువ ప్రాంతాలు, టీకా రవాణా తదితర అంశాలపై అధికాలకు ఉన్నతాధికారుల నుంచి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పిల్లలకు టీకా ఇచ్చే పద్ధతిపై కూడా ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. కొవిన్ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలా? లేక నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లాలా? లేదా విద్యా సంస్థల్లోనే వైద్య సిబ్బంది వచ్చి టీకా వేస్తారా? అనే అంశాలపై మార్గదర్శకాలు రావాల్సి ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
సుమారు ఆరు లక్షల మందికి…
గ్రేటర్ పరిధిలో సుమారు ఆరు లక్షల మంది 15 నుంచి 18 యేండ్ల మధ్య వయస్కులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పిల్లలకు సంబంధించిన వివరాల సేకరణ ప్రక్రియను ప్రారంభించారు. అయితే, టీకా ఇచ్చే వయస్సుపై కూడా మరింత స్పష్టత రావాల్సి ఉందని, 12 యేండ్ల నుంచి 18 యేండ్ల వయస్సులోపు పిల్లలకు టీకా ఇవ్వాలా? లేక 15 నుంచి 18 యేండ్ల మధ్య వయస్సు వారికి ఇవ్వాలా? అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 12 నుంచి 18 మధ్య వయస్సు వారికి టీకా ఇస్తే గ్రేటర్లో టీకా తీసుకునే వారి సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుతం, హైదరాబాద్ జిల్లా పరిధిలో 15 నుంచి 18 యేండ్ల లోపు పిల్లలు సుమారు 1.30 లక్షలు, రంగారెడ్డి జిల్లా పరిధిలో సుమారు 1.7 లక్షలు, మేడ్చల్ జిల్లా పరిధిలో సుమారు లక్ష మంది ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ముందస్తు డోస్కూ ఏర్పాట్లు..
65 ఏళ్ళ వయస్సు పై బడిన
వృద్ధులకు ముందస్తు డోస్(బూస్టర్) ఇచ్చేందుకు కూడా అధికారులు సన్నద్ధమవుతున్నారు. వీరి వివరాలు ఇప్పటికే ఆరోగ్య శాఖ వద్ద ఉన్నప్పటికీ బూస్టర్పై పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉందంటున్నారు అధికారులు. తొలుత రిస్క్ పేషెంట్లు, కోమార్పిడిటిస్ వంటి రిస్క్ పేషెంట్లకు ఇవ్వాలా? లేక వయస్సు పైబడిన వారందరికీ ఇవ్వాలా? అనే దానిపై పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.