యాదాద్రి, మార్చి 18 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం పునః ప్రారంభానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 21న బాలాలయంలో నిర్వహించే పంచకుండాత్మక పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. బాలాలయ ముఖ మండపంలో యాగశాల నిర్మాణాలు నేటితో పూర్తికానున్నాయి. ఐదు యాగశాలలతో స్వామి, అమ్మవార్లను ప్రతిష్ఠించేందుకు ప్రత్యేకంగా వేదిక నిర్మించారు. ఈ నెల 28న యాదాద్రి ప్రధానాలయంలో చేపట్టే మహాకుంభ సంప్రోక్షణకు కావాల్సిన పనులు జరుగుతున్నాయి. త్రితల, పంచతల, సప్తతల రాజగోపురాలకు స్వర్ణ కలశాల బిగింపు ప్రక్రియ పూర్తయ్యింది. దాంతో శుక్రవారం శుద్ధి పనులు చేపట్టారు. ఫైరింజన్ నీటితో ప్రధానాలయ అష్టభుజి ప్రాకారాలు, మాఢవీధులు, ప్రధాన ద్వారాలు శుద్ధి చేశారు.
పంచకుండాత్మక మహాయాగానికి కావల్సిన సామగ్రి యాదాద్రికి చేరుకున్నాయి. ఇందుకు కావాల్సిన టెండర్ల ప్రక్రియ పూర్తవగా, యాగానికి వినియోగించే స్వచ్ఛమైన ఆవు నెయ్యి శుక్రవారం యాదాద్రికి చేరింది. మొత్తం 100లీటర్ల నెయ్యి వినియోగిస్తుండగా, అదనంగా మరో 50లీటర్లను కలుపుకుని 150 లీటర్లు తెచ్చారు. దాతల సహకారంతో మొదుగు కర్రతో పాటు వివిధ యాగ సామగ్రి యాదాద్రికి చేరాయని ఆలయ అధికారులు తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మహాకుంభ సంప్రోక్షణకు వచ్చే వీవీఐపీలకు అందించేందుకు బంగారు, వెండి తాపడపంతో తయారు చేసిన చిత్రపటాలను తిరుపతికి చెందిన దాత సాయి కాలేశ్వర్ యాదాద్రికి బహూకరించారు. మొత్తం 11 బంగారు, వెండి చిత్రపటాలను ఇవ్వనుండగా ప్రస్తుతం ఒకటి బంగారు, రెండు వెండి చిత్రపటాలు అందించారు. మరో ఎనిమిది చిత్రపటాలు మరో రెండుమూడు రోజుల్లో అందించనున్నారు. బంగారు తాపడంతో తయారు చేసిన చిత్రపటానికి రూ.లక్ష ఖర్చయినట్లు ఆలయ అధికారులు తెలిపారు.