మహబూబ్నగర్ : ఈ నెల 11 నుంచి 18 వరకు నిర్వహించనున్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, మార్చి 16 నుంచి 20 వరకు నిర్వహించే అలివేలు మంగ అమ్మవారి బ్రహ్మోత్సవాలను పక్కాగా చేపట్టాలని సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఆయన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణ పై ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. మన్యంకొండకు పేదల తిరుపతిగా పేరుంది ఈ క్షేత్రానికి ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతున్నదన్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం పెద్దఎత్తున ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకుగాను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి తెలిపారు.
మన్యంకొండ దేవాలయం వద్ద భక్తులకు 18 గదులు నిర్మాణంలో ఉన్నాయని, అదేవిధంగా ఏసీ ఫంక్షన్ హాల్ కూడా నిర్మాణం లో ఉందని తెలిపారు. మహబూబ్ నగర్- రాయచూరు రహదారి మన్యంకొండ ఆర్చి నుంచి కొండ పై వరకు రహదారికి ఇబ్బందులు లేకుండా చూడాల పేర్కొన్నారు.
రోడ్డు మధ్యలో డివైడర్, లైటింగ్ ఏర్పాటు చేయాలని, ఫూట్ పాత్ తో పాటు, మొక్కలు పెట్టాలని, బ్రహ్మోత్సవాలలో పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొండపైన, అలివేలు మంగ అమ్మవారి దేవాలయం వద్ద తాత్కాలిక షీ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
హెల్ప్ డెస్క్ తో పాటు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం సూచిక బోర్డులతో పాటు పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ ద్వారా కొండపైకి ప్రత్యేక బస్సులు నడపాలని, అదేవిధంగా పర్యాటక శాఖ ద్వారా ప్రత్యేక ప్యాకేజీ తో స్పెషల్ బస్సును ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ అధికారిని ఆదేశించారు.
అలివేలు మంగ అమ్మవారి దేవస్థానం వద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ లో తీర్చిదిద్దాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మధుసూదన్ ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, రైతుబంధు డైరెక్టర్ నరసింహారెడ్డి, ఎంపీపీ సుధా శ్రీ, వైస్ ఎంపీపీ అనిత,తదితరులు పాల్గొన్నారు.