న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్లో భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ మంగళవారం ఉదయం కూలిపోయింది. కథువా జిల్లాలోని రంజిత్ సాగర్ డ్యామ్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోగా.. సహాయక చర్యల కోసం అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపారు. 254 ఆర్మీ ఏవియేషన్ స్క్కాడ్రన్ హెలికాప్టర్ మామున్కాంట్ నుంచి ఉదయం 10.20 గంటలకు బయలుదేరింది. డ్యామ్ ప్రాంతంలో తక్కువ ఎత్తులో విన్యాసాలు చేస్తుండగా కూలిపోయినట్లు తెలుస్తోంది. రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరగా.. గజ ఈతగాళ్లను సైతం రప్పించారు.
అయితే, ఈ చాపర్లో ఎందరు ఉన్నారు? వారి ఆచూకీ గురించి సమాచారం అందలేదని కథువా జిల్లా ఎస్ఎస్పీ ఆర్సీ కొత్వాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో జమ్మూ కాశ్మీర్-పంజాబ్ సరిహద్దుకు సమీపంలో కథువా జిల్లా లఖన్పూర్లో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఓ పైలట్ మృతి చెందారు. హెచ్ఏఎల్ ధృవ్ హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా కూలిపోయింది.