వెల్దుర్తి, నవంబర్ 20: రైతుల ఫిర్యాదు మేరకు జమున హ్యాచరీస్ భూకబ్జాకు సంబంధించిన సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో జమున హ్యాచరీస్ భూకబ్జాలపై నిర్వహిస్తున్న సర్వే తీరును శనివారం సాయంత్రం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే వివరాలు, హద్దుల ఏర్పాటుపై రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాధిత రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో సర్వే పూర్తయి నివేదికలు వస్తాయని తెలిపారు. అచ్చంపేట పరిధిలోని 77, 78,79, 80, 81, 82, 130వ సర్వే నంబర్లలో సర్వే పూర్తయిందన్నారు. రైతులు, సర్వే నంబర్ల వారీగా భూములను గుర్తించి హద్దులను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. 97వ సర్వే నంబర్లో హద్దులను ఏర్పాటు చేయాల్సి ఉన్నదని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సాయిరాం, మాసాయిపేట తాసిల్దార్ మాలతి, ఆర్ఐ ధన్సింగ్, తూప్రాన్ డీఎల్పీవో వరలక్ష్మి ఉన్నారు.
పీసీబీ అధికారుల పరిశీలన..
జమున హ్యాచరీస్ పరిశ్రమ రాత్రివేళల్లో పారబోస్తున్న వ్యర్థాలతో తీవ్ర దుర్వాసన వస్తున్నదని, తద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పక్కనే ఉన్న చెరువు సైతం కలుషితం అవుతుందని అచ్చంపేట రైతులు ఫిర్యాదు చేయగా.. శనివారం పీసీబీ అధికారులు వచ్చి పరిశీలించారు. పీసీబీ ఏఈఈ తదితరులు నమూనాలు తీసుకెళ్లారు. వాటి నివేదిక అందిన తర్వాత శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.