నాలుగేండ్లకోసారి నిర్వహించే జంతు గణన మెదక్ జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతున్నది. ఈ నెల 22న ప్రారంభమైన ఈ ప్రక్రియ 28తో ముగియనుండగా, జంతువుల లెక్క పక్కాగా తేల్చేందుకు అటవీశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేటాయించిన బీట్లలో సిబ్బంది బృందాలుగా ఏర్పడి జిల్లాలోని 58 వేల హెక్టార్లకు పైగా ఉన్న అటవీ ప్రాంతంలో ఏయే జంతువులు ఉన్నాయి? వాటిలో మాంసాహార, శాఖాహార జంతువులు ఎన్ని? అని గుర్తించి, కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వగా, మొత్తం 128 మంది గణనలో పాల్గొంటున్నారు.
మెదక్ జిల్లాలో జంతు గణన ప్రారంభమైంది 22వ తేదీ నుంచి 28 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. గణనను సులభతరంగా పూర్తి చేయడానికి రేంజ్ల పరిధిలో బృందాలను ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా నాలుగేండ్లకోసారి అటవీశాఖ ఆధ్వర్యంలో జంతు గణన చేస్తుండగా, చివరిగా 2018లో నిర్వహించారు. ఇందుకోసం అటవీశాఖాధికారులు బృందాలుగా ఏర్పడి జంతు గణన చేస్తారు. ఒక్కో బీట్లో ఒక్కో బృందం సర్వే చేస్తుంది. ఒక బృందంలో ఇద్దరు నుంచి ముగ్గురు సిబ్బంది ఉంటారు. ఒక్కో బృందంలో ఓ విభాగ అధికారి, ఇద్దరు బీట్ అధికారులు విధులు నిర్వహిస్తారు. కేటాయించిన బీట్ పరిధిలో ఎలాంటి జంతువులు సంచరిస్తున్నాయో వాటి ఆనవాళ్లను గుర్తించి రికార్డులో నమోదు చేస్తారు. ఇలా ప్రధాన జంతువుల వివరాలను సేకరించి వాటిల్లో శాఖాహార, మాంసాహారానికి చెందినవి ఎన్ని ఉన్నాయనేది పక్కాగా తేల్చనున్నారు. మెదక్ జిల్లాలో 58 వేలహెక్టార్లకు పైగా అటవీప్రాంతం ఉండగా, దట్టమైన అడవి 9,699.29 శాతం, ఓపెన్ ఫారెస్ట్ 32,174.52, పొదల అడవి 9,992.27 శాతం ఉంది. ముఖ్యంగా నర్సాపూర్, కొల్చారం, కౌడిపల్లి, శివ్వంపేట, రామాయంపేట, హవేళీఘనపూర్, వెల్దుర్తి, చేగుంట మండలాల పరిధిలో విస్తరించి ఉంది. జిల్లాలో 98 బీట్లు, 27 సెక్షన్లు ఉన్నాయి. అటవీ శాఖ సిబ్బంది వాచర్లతో పాటు ఇతరత్రా వలంటీర్లు మొత్తం 128 మంది గణనలో పాల్గొంటున్నారు.
జంతు జాడలను ఇలా గుర్తిస్తారు..
అటవీ ప్రాంతంలో చిరుతలు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, కుందేళ్లు, జింకలు, అడవిపందులు, నీలుగాయి, దుప్పి, కొండగొర్రెలు, కృష్ణజింకలు, నెమళ్లు తదితర వన్యప్రాణులను లెక్కిస్తారు. ప్రధానంగా అడవిలో నీరున్న ప్రాంతాల్లో జంతువుల పాద ముద్రలు, నేలపై గోర్లతో గీసిన గీతలు, రాలిపోయిన వెంట్రుకలు, మృతదేహాల అవశేషాలు, విసర్జితాలు, అరుపులు తదితర ఆనవాళ్ల ఆధారంగా జంతువుల సమాచారాన్ని అంచనా వేస్తారు. ఒంటరిగా నివసించేవి, సమూహంగా జీవించే వాటి వివరాలు సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మాట్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. గణన కోసం అటవీశాఖ అధికారులకు సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.కాగా, ఈ గణన సీసీఎఫ్ ఎఫ్డీపీటీ నిర్మల్ రిజర్వ్ కవ్వాల్ టైగర్ వారి పర్యవేక్షణలో ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. సేకరించిన వివరాలను ప్రతి రోజూ ఆన్లైన్లో ఉన్నతాధికారులకు పంపించనున్నారు.
పక్కాగా లెక్క తేలుస్తాం..
ఈ నెల 22 నుంచి చేపట్టిన వన్యప్రాణుల గణన పకడ్బందీగా పూర్తి చేస్తాం.. ప్రతి రోజు 5కి.మీ పరిధిలో
గణన చేపడుతాం. ప్రతీ బీట్లో పూర్తి స్థాయిలో జంతువులను లెక్కిస్తాం. జిల్లాలోని అన్ని రేంజ్లలో గణన చేయడానికి అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పులుల, జంతు గణన-2022లో భాగంగా ఈనెల 22వ తేది నుంచి 24 వరకు మంసాహార జంతువుల గణన, 25న ట్రాన్సెక్ట్ లైన్ గుర్తింపు, 26 నుంచి 28 వరకు శాఖాహార జంతు గణన నిర్వహిస్తాం.