న్యూఢిల్లీ, మార్చి 9: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ భారత్లో ఐఫోన్ 12 మోడల్ హ్యాండ్సెట్ల తయారీని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం తమ ఉత్పత్తి సామర్థ్యంలో 7 నుంచి 10 శాతం వరకు చైనా నుంచి భారత్కు తరలించాలని యోచిస్తున్నది. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం వస్తే తమకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునేందుకు యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. యాపిల్ ఇప్పటికే భారత్లోని తమ కాంట్రాక్టు భాగస్వాముల ద్వారా ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 11 హ్యాండ్సెట్లను తయారు చేస్తున్నది. వీటికి తోడుగా ఇప్పుడు ఐఫోన్ 12 హ్యాండ్సెట్లను కూడా భారత్లో తయారు చేయాలని యాపిల్ నిర్ణయించడంతో దేశీయంగా ఈ హ్యాండ్సెట్ల ధరలు తగ్గే అవకాశమున్నది. కానీ దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రస్తుతం భారత్లో ఐఫోన్ 12 రిటైల్ ధర రూ.69,990 నుంచి ప్రారంభమవుతున్నది. భారత్లో తయారయ్యే ఐఫోన్ 12 హ్యాండ్సెట్లను దేశీయ కస్టమర్లతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తున్నది. దీంతో యాపిల్కు దిగుమతి సుంకాల భారం భారీగా తగ్గుతుంది.