న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం యాపిల్ (Apple) భారత్లో తొలి రిటైల్ స్టోర్స్ను ఢిల్లీ, ముంబైలో గతవారం లాంఛ్ చేసింది. రెండు స్టోర్స్లో కలిపి 15 భాషల్లో మాట్లాడగలిగే సామర్ధ్యం కలిగిన 170 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ స్టోర్స్లో ఎంబీఏ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లో బీటెక్, బీసీఏ వంటి విద్యార్హతలతో కూడిన అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను కంపెనీ హైర్ చేసింది.
రిటైల్ స్టోర్ ఎగ్జిక్యూటివ్స్లో కొందరికి నెలకు రూ. లక్ష వరకూ వేతనాన్ని యాపిల్ ఆఫర్ చేస్తోందని సమాచారం. ఇది దేశంలో ఇతర ఎలక్ట్రానిక్ స్టోర్స్ తమ ఎగ్జిక్యూటివ్లకు అందించే వేతనం కంటే రెండు, మూడు రెట్లు అధికం. యాపిల్ స్టోర్స్లో పనిచేసే కొందరు ఉద్యోగుల లింక్డిన్ ప్రొఫైల్స్ పరిశీలించగా పలువురు ఎంబీఏ, డేటా అనాలిసిస్ నేపధ్యం కలిగిన వారు ఉన్నట్టు వెల్లడైంది. ఒక్కో ఉద్యోగికి సగటున ఏడేండ్ల అనుభవం ఉంది. యాపిల్ ఇండియా స్టోర్ ఉద్యోగుల్లో కొందరు కేంబ్రిడ్జి, గ్రిఫిత్ యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో చదివిన వారూ ఉండటం గమనార్హం.
విదేశాల్లో యాపిల్ రిటైల్ స్టోర్స్లో పనిచేసిన అనుభవమున్న ఉద్యోగులు కొందరు ఢిల్లీలోని యాపిల్ స్టోర్లో పనిచేస్తున్నారు. భారత్లోని తమ స్టోర్స్లో మరికొన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని యాపిల్ కెరీర్ పేజ్లో పేర్కొంది. యాపిల్ జీనియస్ పొజిషన్ కోసం యాపిల్ కస్టమర్లకు టెక్నికల్ సపోర్ట్ అందచేసే నైపుణ్యాలు కలిగిన అభ్యర్ధుల కోసం అన్వేషిస్తున్నట్టు తెలిపింది.
Read More