AP News : వైసీపీ అధినేత జగన్ మహిళా సమస్యలపై చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు, టీడీపీ నేత సానా సతీష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత తల్లిని, చెల్లిని వెన్నుపోటు పొడిచిన జగన్.. మహిళల గురించి మాట్లాడటం అత్యంత విడ్డూరంగా, నైతికత లేని చర్యగా ఉందని మండిపడ్డారు. జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన కొన్ని వాస్తవాలను సానా సతీష్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో జగన్ 11 మందిని రాజ్యసభకు నామినేట్ చేశారని, అయితే ఆ 11 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా మహిళకు కేటాయించలేదని ఆయన ధ్వజమెత్తారు.
జగన్ తల్లి వైఎస్ విజయమ్మను విశాఖపట్నం లోక్సభ స్థానంలో ఓడిపోయేలా చేశారని, ఆ తర్వాత ఆమెతో బలవంతంగా పార్టీ నుంచి రాజీనామా చేయించారని ఆరోపించారు. పెయిడ్ మీడియా ద్వారా మహిళలపై విషపూరిత ప్రచారాలు చేయించడమే జగన్ నైజమని విమర్శించారు. తన సొంత తల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి రాష్ట్రంలోని మహిళల సంక్షేమం గురించి ఎలా మాట్లాడతారని సతీష్ నిలదీశారు. మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం జగన్ను తీవ్రమైన ఆత్మరక్షణలో పడేసిందని, ఇప్పుడు ఆయనకు ఏం చేయాలో పాలుపోని నిస్సహాయ స్థితి ఏర్పడిందని సానా సతీష్ ఎద్దేవా చేశారు.