AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జరిగిన రాజకీయ హత్యలపై ఇటీవల వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీడీపీ హయాంలోనే తన తాత వైఎస్ రాజారెడ్డి, బాబాయ్ వివేకానందారెడ్డి హత్యకు గురయ్యారని ఆయన ఆరోపించారు. అయితే జగన్ ఆరోపణలపై టీడీపీ నేత బీటెక్ రవి తీవ్రంగా స్పందించారు. అసలు రాజకీయ హత్యలకు బాట వేసిందే వైఎస్ కుటుంబమంటూ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బీటెక్ రవి వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
బీటెక్ రవి స్థాయిని ప్రశ్నిస్తూ అవినాష్ రెడ్డి తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. బీటెక్ రవి తమ నాయకులను వాడు వీడు అని మాట్లాడాడని, అతని గురించి తాము కూడా అలా మాట్లాడగలమని, కానీ సభ్యత అడ్డు వస్తోందని అన్నారు. ఇసుక, ముగ్గురాయి వ్యాపారాలకు కన్నం వేసి బతికే వ్యక్తి జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని చెప్పారు. బీటెక్ రవి నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరించారు. గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో బీటెక్ రవి అప్పటి వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇంటి చుట్టూ ఎందుకు తిరిగారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
తాను గెలిచిన ఎమ్మెల్సీ పదవిని అమ్ముకోవడానికి రూ.12 కోట్లు ఇప్పించమంటూ బీటెక్ రవి విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చాడని అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. తన పదవిని అమ్మేసి, వైసీపీ కండువా కప్పుకుంటానని ఆనాడు రవి ప్రతిపాదించగా.. అలాంటి నీచమైన పనులను తాము ప్రోత్సహించబోమంటూ జగన్ స్వయంగా తిరస్కరించారని చెప్పారు. ఒకవేళ వైసీపీలో చేర్చుకోకపోతే సీఎం రమేష్ను పట్టుకుని బీజేపీలోకి వెళ్తానని నాడు రవి బేరసారాలు సాగించాడని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకు బీటెక్ రవిదని, అలాంటి వ్యక్తి వైఎస్ కుటుంబం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మండిపడ్డారు.