అమరావతి : రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బలం, డబ్బుల పంపిణీ, పోలీసు, ప్రభుత్వం సహకరించడంతోనే వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బుధవారం వెలువడ్డ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. కుప్పంలో టీడీపీ ఓటమిని ఎవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు. అయితే గత 7నెలల క్రితం జరిగిన ఎన్నికలు , ప్రసుత్తం జరిగిన ఎన్నికల్లో టీడీపీ భారీగా ఓటింగ్ శాతం పెరిగిందని, దమ్ముంటే వైఎస్సార్సీపీ అన్ని పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సవాలు విసిరారు.
అప్పడు కూడా వైఎస్సార్సీపీ గెలిస్తే తాము టీడీపీ ని మూసేస్తామని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో అనేక చోట్ల టీడీపీ అభ్యర్థులను బెదిరించారని, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, ఓటర్లను భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయడం వల్లే టీడీపీ ఓటమి పాలైందని ఆయన తెలిపారు. ఏపీలో వైఎస్సార్సీపీ విజయాన్ని డీజీపీకి అంకితం చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు.