Bird flu : రాష్ట్రంలో ఏవియన్ ఇన్ఫ్లూయెంజా (Bird flu) వైరస్ మరింత విస్తరించకుండా తగు చర్యలు చేపట్టారు. పోలీస్, రెవెన్యూ, అటవీ, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ను ఏర్పాటు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల, కోవూరు మండలం గుమ్మలదిబ్బలో మరణించిన కోళ్ల నమూనాలను భోపాల్లోని ల్యాబ్కు పంపామని, ఆ కోళ్లకు ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ సోకినట్లు నిర్ధారణ జరిగిందని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేశామని అమరేంద్రకుమార్ వెల్లడించారు. ప్రభావిత గ్రామాలకు చుట్టూ కిలో మీటరు వరకు ఇన్ఫెక్టెడ్ జోన్గా, పది కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ ప్రాంతంగా ప్రకటించినట్లు తెలిపారు. కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రాకపోకలను కట్టడి చేశామన్నారు. గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కోళ్లలో అసాధారణ మరణాలు తగ్గాయని తెలిపారు. రాష్ట్రంలో కోళ్లు అధికంగా ఉండే కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలతోపాటు.. వలస పక్షులు వచ్చే నెల్లూరు, కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ అదుపులోనే ఉందని, ఎవరికైనా అనుమానాలు ఉంటే 1962 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలని సూచించారు.