YS Jagan | 14 ఏండ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏ పేదకైనా మంచి చేశారా? అని ఏపీ సీఎం జగన్ ప్రశ్నించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమైనా గుర్తొస్తుందా అని అడిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుకొండలో నిర్వహించిన రోడ్ షోలో ఏపీ సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు రకరకాల వాగ్ధానాలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోవడంతో 2019లో రైతన్నలు, మహిళలు, నిరుద్యోగులు, సామాజిక వర్గాలు, పల్లె, పట్టణ ప్రజలు అంతా కలిసి సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారని విమర్శించారు.
2019 ఎన్నికల తర్వాత తుప్పుబట్టిన సైకిల్కు రిపేర్ చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని జగన్ విమర్శించారు. ఆ రిపేర్ చేయించడంలో భాగంగా ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్లాడని తెలిపారు. ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్లినప్పుడు అక్కడ ఫలితం రాలేదని.. దీంతో దత్తపుత్రుడిని పిలుచుకున్నాడని అన్నారు. ఆ దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూసి.. నేను క్యారేజి మీద మాత్రమే ఎక్కుతాను.. టీ గ్లాస్ మాత్రమే పట్టుకుని తాగుతానని అన్నాడని విమర్శించారు. మిగతావి తన వల్ల కాదని దత్తపుత్రుడు చెప్పాడని అన్నారు. ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడని.. అక్కడి మెకానిక్లను ఇక్కడికి దింపాడని అన్నారు. ‘ సైకిల్ను ఒక షేప్లోకి తీసుకురమ్మని ఆ మెకానిక్లను బాబు అడిగాడు. ఆ మెకానిక్లు వచ్చి తుప్పుబట్టిన సైకిల్ను చూశారు.. ఆ సైకిల్కు హ్యాండిల్ లేదు.. సీటు లేదు.. పెడల్స్ లేవు.. చక్రాలు లేవు.. ట్యూబ్లు లేవు.. మధ్యలో ఫ్రేమ్ కూడా లేవు.. ఇంత తుప్పబట్టిన సైకిల్ను ఎలా బాగు చేస్తామని చంద్రబాబును అడిగారు. అప్పుడు పిచ్చి చూపులు చూసి.. ఇదొక్కటే మిగిలిందని బెల్ను చూపించి.. బెల్ కొట్టడం మొదలుపెట్టాడు.’ అని విమర్శించారు. ఆ బెల్ పేరే.. అబద్ధాల మేనిఫెస్టో అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు చేస్తూనే ఉంటారని విమర్శించారు.
అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో.. 2014 మేనిఫెస్టో చూస్తే తెలుస్తుందని జగన్ అన్నారు. ఇదే ముగ్గురితో అప్పుడు కూటమిగా ఏర్పడి.. ఒక మేనిఫెస్టోను ఇంటింటికీ పంపించాడని గుర్తు చేశారు. ఆ మేనిఫెస్టోతో గెలిచిన తర్వాత.. అందులో చెప్పిన ఒక్క దాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు.