Red alert : దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్నాయి. జనం ఇళ్లలోంచి అడుగు బయటపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు. ఢిల్లీకి వచ్చే పర్యాటకులు కూడా ఎండలకు అల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా ఎండల తీవ్రత మరింత పెరుగుతున్నది. సుమారుగా 28 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం అత్యధికంగా 44 డిగ్రీలకు ఎండ తీవ్రత చేరింది. దాంతో ఐఎండీ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీచేసింది.
మరో వారం రోజులపాటు కూడా ఢిల్లీలో ఎండలు ఇదేవిధంగా ఉండే అవకాశం ఉన్నదని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త నరేశ్ కుమార్ చెప్పారు. రానున్న ఐదు రోజులు రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా ఎండల తీవ్రత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా తాము ఇండియా గేట్ సందర్శనకు వచ్చామని, ఇక్కడ ఎండలకు పిల్లలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని పర్యాటకులు వాపోయారు. పర్యాటక ప్రదేశాల్లో తాగునీటి క్యాంపులు ఏర్పాటు చేస్తే బాగుండేదని అన్నారు.