రచయిత పలుకులివి. సరిగ్గా పాత పెద్ద నోట్ల రద్దు తంతులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంగతి ఇలాగే ఉంది మరి.నల్లధనం వెలికితీస్తామని.. దేశాన్ని డిజిటల్ బాట పట్టిస్తానని.. కరెన్సీ రహిత ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తానంటూ ఐదేండ్ల క్రితం లెక్చర్లు దంచుతూ చేసిన డీమానిటైజేషన్ తుస్సుమన్నది.నోట్ల రద్దు తర్వాత చలామణిలోని కరెన్సీ విలువ సుమారు మూడింతలు ఎగిసి ఏకంగా రూ.30 లక్షల కోట్లను దాటేసింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: డిజిటల్ ఎకానమీ అబద్ధమేనా?.. పాత పెద్ద నోట్ల రద్దు వృథాయేనా?.. అంటే అవుననే సమాధానమే చెప్పాల్సి వస్తున్నది. ఐదేండ్ల క్రితం నవంబర్ 8, 2016న చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. నల్లధనం వెలికితీత పేరుతో రాత్రికిరాత్రి డీమానిటైజేషన్ను తెచ్చారు. కానీ ఏం లాభం.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా తయారైంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. దేశ ద్రవ్యవ్యవస్థలో కరెన్సీని పరిశీలిస్తే జరిగింది ఇదే. ఓవైపు ప్రోత్సాహకాలతో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగినా.. మరోవైపు కరెన్సీ చలామణి, వాటి లావాదేవీలు కూడా అదేస్థాయిలో పెరగడం గమనార్హం.
నగదుదే హవా
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పుడు చలామణిలో రూ.14,26,495 కోట్ల విలువైన కరెన్సీ ఉన్నది. డీమానిటైజేషన్ తర్వాత రూ.13,10,181 కోట్లకు పడిపోయింది. అయితే గత నెల జనవరి 28 నాటికి ఇది రూ.30,04,604 కోట్లకు ఎగబాకడం గమనార్హం. అంటే మోదీ ప్రభుత్వం రాకముందుతో చూస్తే రెట్టింపునకుపైగా, నోట్ల రద్దు తర్వాత చూస్తే సుమారు మూడింతలైనట్టు తేలింది.
ఖర్చే తప్ప.. కనిపించని లాభం
నోట్ల రద్దు నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)పై పెనుభారమే పడింది. జూలై 2016 నుంచి జూన్ 2017 (2016-17) మధ్య ఆర్బీఐ కరెన్సీ ముద్రణ వ్యయం రూ.7,965 కోట్లు. 2015-16లో రూ.3,420 కోట్లుగానే ఉన్నది. ఖర్చు 133 శాతం పెరిగినట్టు తమ వార్షిక నివేదికలో ఆర్బీఐనే చెప్పింది. ఇక నోట్ల రద్దు తర్వాత కొత్తరకం కరెన్సీని ఆర్బీఐ పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక్కో రూ.2,000 నోటు ముద్రణ ఖర్చు రూ.3.54గా ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. అలాగే రూ.500 నోటుకు రూ.2.94, రూ.200 నోటుకు రూ.2.93 చొప్పున ఖర్చు చేసింది. ఇలాగే రూ.100, రూ.50, రూ.20, రూ.10 డినామినేషన్లలోనూ కొత్త నోట్లను తీసుకురాగా, ఖర్చూ పెరిగింది. ఏటేటా ఈ ఖర్చును లెక్కిస్తే.. నోట్ల రద్దుతో మోదీ సర్కారు సాధించింది అర్థం చేసుకోవచ్చు.
నల్లధనం ఏది?
దేశంలో నల్లధనం.. కరెన్సీ రూపంలోనే ఉందన్న వాదనతో నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి తుది ఫలితం ఏమాత్రం మింగుడుపడకుండా వచ్చింది. ప్రజలంతా తమ వద్దనున్న పాత పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకోవాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పాత కరెన్సీ అంతా తిరిగి వచ్చేయడంతో తెల్లబోవాల్సి వచ్చింది. పైగా నోట్ల మార్పిడి కోసం ఎందరో అమాయకులు బలైపోగా, లేనిపోని భయాలతో మరెన్నో కుటుంబాలు ఆగమయ్యాయంటే అతిశయోక్తి కాదు.