ఢిల్లీ, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు దారుణంగా ఉన్నదని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. తెలంగాణ నుంచి ఎంత ధాన్యం సేకరిస్తారో స్పష్టం చేయడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ధాన్యం సేకరణపై కేంద్రానికి ఒక విధానమే లేదని విమర్శించారు. సోమవారం పార్లమెంటు ఉభయసభలు వాయిదాపడిన అనంతరం తెలంగాణభవన్లో పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. పంటల ఉత్పత్తుల సేకరణపై కేంద్ర ప్రభుత్వం జాతీయ విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. పండిన పంటలను సేకరించే విషయంలో కేంద్ర విధానం లోపభూయిష్టంగా ఉన్నదని దుయ్యబట్టారు. గతంలో చేసుకొన్న ఒప్పందం మేరకు తెలంగాణ నుంచి కేవలం 40 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని కేంద్రం చెప్తున్నదని పేర్కొన్నారు. కోటి టన్నుల ధాన్యాన్ని ఇవ్వడానికి తెలంగాణ సిద్ధంగా ఉన్నదని, ఇది దేశానికి ఎంతో ప్రయోజనకారి అని చెప్పారు. కానీ కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. పార్లమెంటులో గందరగోళం సృష్టించాలన్నది టీఆర్ఎస్ ఉద్దేశం కాదని, రైతుల ఆందోళనలను సభ దృష్టికి తీసుకురావాలన్నదే తమ అభిమతమని తెలిపారు. పంజాబ్కు ఒక విధానం, తెలంగాణాకు ఇంకో విధానం ఉండటం సరికాదని పేర్కొన్నారు. కేంద్రం, కేంద్ర మంత్రులు రైతులకు ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని హితవు చెప్పారు. తెలంగాణలోని ప్రత్యేక వాతావరణ పరిస్థితుల రీత్యా బాయిల్డ్ రైస్ మాత్రమే ఇవ్వడం సాధ్యమవుతున్నదని వివరించారు. బాయిల్డ్ కాకుండా రా రైస్గా ఇస్తే రైతులకు, మిల్లర్లకు, ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని చెప్పారు. రైతులను ఇతర పంటలవైపు మళ్లించేందుకు రెండుమూడేండ్లు సమయం ఇవ్వాలని తాము కోరుతున్నామని, పరిస్థితులను అర్థం చేసుకొని తదనుగుణంగా వ్యవహరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
రెండు నెలలైనా పట్టించుకోరా?: టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు
ధాన్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం రెండు నెలలుగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ పట్టించుకోవడంలేదని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసినా చలనం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. యాసంగి నాట్లు మొదలైన తర్వాత తాము కొనుగోలు చేయబోమని కేంద్రం చేతులెత్తేయడం ఏమి పద్ధతని ప్రశ్నించారు. కేంద్ర అనాలోచిత విధానాలతో దేశ రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ రైతులు రోడ్డునపడే పరిస్థితి తలెత్తుతున్నదని చెప్పారు. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును సైతం ఎలాంటి చర్చ లేకుండా ఏకపక్షంగా ఆమోదించారని నిరసన వ్యక్తంచేశారు. తెలంగాణ రైతుల పక్షాన మిగిలిన ఎంపీలంతా కలిసి పోరాడాలని, లేకుంటే రైతుల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు.
పీయూష్గోయల్ను నిలదీసిన టీఆర్ఎస్ ఎంపీలు
రాజ్యసభకు సోమవారం హాజరైన కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్గోయల్ను టీఆర్ఎస్ ఎంపీలు నిలదీశారు. సభలో వెల్లోకి దూసుకుపోతున్న ఎంపీలకు పీయూష్ గోయల్ కనిపించడంతో కేశవరావు, బండ ప్రకాశ్, సంతోష్కుమార్, కేఆర్ సురేశ్రెడ్డి ఆయనను చుట్టుముట్టి తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని నిలదీశారు.సభ వాయిదాపడటంతో మంత్రి వెళ్లిపోయారు.
ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వండి: లోక్సభలో ఎంపీ రంజిత్రెడ్డి
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఎంపీ జీ రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం లోక్సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగిందని, దానికి అనుగుణంగా ఎఫ్సీఐ కొనుగోళ్లు పెంచాలని కోరారు.
ఇతర పార్టీల మద్దతుపై కసరత్తు
జాతీయ స్థాయిలో రైతు సమస్యల పరిష్కారానికి కలిసివచ్చే పార్టీలతో టీఆర్ఎస్ ఎంపీలు చర్చలు జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సమగ్ర విధానం ప్రకటించడం, ఎమ్మెస్పీపై చట్టం చేయాలన్న డిమాండ్లపై మంగళవారం కూడా వాయిదా తీర్మానం ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు టీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఉదయం సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది. 12 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన నేపథ్యంలో మంగళవారం ప్రతిపక్ష పార్టీలు నిర్వహించే సమావేశానికి టీఆర్ఎస్ తరఫున కేశవరావు హాజరుకానున్నారు.
ఎమ్మెస్పీపై చట్టం చేయాలని డిమాండ్
ధాన్యం కొనుగోళ్లపై తేల్చిచెప్పాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం ఉదయం లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఏసీ సమావేశాలకు హాజరైన టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని చెప్పాలని ఉభయసభల్లో టీఆర్ఎస్ తరఫున వాయిదా తీర్మానాలిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో ఛైర్మన్ ప్రకటించారు. వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలని రాజ్యసభలో కేశవరావు నేతృత్వంలో ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, బండా ప్రకాశ్, సంతోష్కుమార్ తదితరులు పట్టుబట్టారు. తెలంగాణా రైతాంగానికి జరుగుతున్న అన్యాయంపై చర్చించాలని లోక్సభలో నామా నాగేశ్వరరావు , బీబీ పాటిల్, జీ రంజిత్రెడ్డి, పీ రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్ నేత తదితరులు నినదించారు. దీంతో స్పీకర్ సభను పలుమార్లు వాయిదా వేశారు. ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. రైతులను శిక్షించవద్దు, రైతులపై వివక్ష వద్దు, అభివృద్దిచెందుతున్న రాష్ట్రాలను అన్యాయం చేయవద్దు, జాతీయ ఆహారధాన్యం సేకరణ విధానం ప్రకటించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇచ్చే అంశంపై చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఉభయసభలు వాయిదాపడటంతో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులోని సెంట్రల్ హాల్కు ఆందోళనలను మార్చారు. వివిధ పార్టీల ఎంపీలు వచ్చి సానుభూతి వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం ఉభయసభలు ప్రారంభం కావడంతో టీఆర్ఎస్ ఎంపీలు అక్కడ మరోసారి బైఠాయించారు. రాజ్యసభ వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. దీంతో రాజ్యసభను మంగళవారానికి వాయిదా వేశారు. లోక్సభలో కూడా నిరసన కొనసాగడంతో సభను వాయిదావేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఉభయసభలు వాయిదాపడటంతో టీఆర్ఎస్ ఎంపీల బృందం తెలంగాణభవన్కు వెళ్లి, అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కొనసాగించింది.